RBI Reporate | ద్రవ్య పరపతి విధానం (ఎంపీసీ)పై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా వరుసగా పదోసారి కీలక వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగిస్తూ గురువారం ఆర్బీఐ నిర్ణయించింది. ఒమిక్రాన్ వేరియంట్ కేసుల నేపథ్యంలో ఆర్థిక రికవరీ ఇంకా పూర్తి కాలేదని, ఇంకా పాలసీ మద్దతు కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ ఎంపీసీ సమావేశం నిర్ణయించింది. దీని ప్రకారం రెపోరేట్ 4 శాతం, రివర్స్ రెపోరేట్ 3.35 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాకు చెప్పారు.
ఆర్థిక విశ్లేషకులు రివర్స్ రెపోరేట్ 15-40 బేసిక్ పాయింట్లు పెంచుతున్నట్లు అంచనా వేశారు. రెపోరేట్ యథాతథంగా కొనసాగించాలని ఎంపీసీ సమావేశంలో 5-1 ఓట్ల తేడాతో నిర్ణయించారు. కొవిడ్ ప్రభావంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, స్థిరమైన వృద్ధిరేట్ సాధించడానికి అనుకూల వైఖరిని తీసుకోవాలని ఆర్బీఐ నిర్ణయించింది.
2019తో పోలిస్తే ప్రస్తుతం రెపోరేట్ 250 బేసిక్ పాయింట్లు తక్కువగా ఉన్నది. కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి 2020 మార్చిలో రెపోరేట్లో 115 బేసిక్ పాయింట్లు తగ్గించింది. 2020 మేలో రెపోరేట్ను 4 శాతానికి ఆర్బీఐ పరిమితం చేసింది. నాటి నుంచి ఇప్పటి వరకు ఆర్బీఐ యథాతథ స్థితిని కొనసాగిస్తూ వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 5.3 శాతం, వచ్చే ఏడాది 4.5 శాతంగా నమోదవుతుందని ఆర్బీఐ అంచనా వేసింది.