Stock Market | న్యూఢిల్లీ, మార్చి 25: దేశీయ స్టాక్ మార్కెట్లను ఈ వారం అంతర్జాతీయ పరిణామాలు ఎక్కువగా ప్రభావితం చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్ఐఐ) కదలికలూ కీలకమేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక గురువారం మార్చి నెలకుగాను ఎఫ్అండ్వో డెరివేటివ్ల గడువు ముగుస్తుండటంతో ఇన్వెస్టర్లు షేర్ల క్రయవిక్రయాలపై గట్టిగానే దృష్టి పెడుతారని, దీంతో ఒడుదొడుకులు తప్పవన్న రీతిలో బదులిస్తున్నారు. కాగా, సోమవారం హోలీ కారణంగా మూతబడ్డ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం గుడ్ఫ్రైడే వల్ల సెలవు తీసుకోనున్నాయి. దీంతో ఈ వారం మొత్తంగా మూడు రోజులే ట్రేడింగ్ జరుగనున్నది. మరోవైపు ఈ వారంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) కూడా ముగుస్తుండటంతో సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాటకు గురవుతాయన్న అభిప్రాయాన్నే స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ లిమిటెడ్ రిసెర్చ్ విభాగం అధిపతి సంతోష్ మీనా వ్యక్తం చేశారు. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ కూడా భారతీయ స్టాక్ మార్కెట్లను శాసించగలదన్న అంచనాలున్నాయి. ఇప్పటికే రూపీ విలువ రికార్డు స్థాయి కనిష్ఠానికి పడిపోయిన విషయం తెలిసిందే. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 48 పైసలు పతనమై 83.61 వద్దకు దిగజారింది. ఇదిలావుంటే అమెరికా, ఆసియా, ఐరోపా మార్కెట్ల తీరుతెన్నూలనూ దేశీయ మదుపరులు దగ్గరగా గమనిస్తూ నిర్ణయాలు తీసుకుంటారని మెజారిటీ విశ్లేషకులు చెప్తున్నారు. గత వారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 188.51 పాయింట్లు లేదా 0.25 శాతం పెరిగి 72,831.94 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 73.4 పాయింట్లు లేదా 0.33 శాతం అందుకుని 22,096.75 వద్ద నిలిచింది.
రూ.38,000 కోట్లు..
ఈ నెలలో ఇప్పటిదాకా దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరుల (ఎఫ్పీఐ) పెట్టుబడులు రూ.38,000 కోట్లపైనేనని తేలింది. ఈ ఏడాది జనవరిలో భారీ ఎత్తున రూ.25,743 కోట్ల పెట్టుబడులను భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్పీఐలు వెనక్కి తీసుకున్నారు. అయితే ఫిబ్రవరిలో రూ.1,539 కోట్ల పెట్టుబడులను తెచ్చారు. ఈ క్రమంలో ఈ మార్చిలో 38,097 కోట్ల పెట్టుబడులను పట్టుకొచ్చారు. దీంతో ఈ ఏడాదిలో ఎఫ్పీఐల నికర పెట్టుబడులు రూ.13,893 కోట్లుగా ఉన్నాయి. మరోవైపు రుణ మార్కెట్లలోకి వచ్చిన పెట్టుబడులు రూ.55,480 కోట్లుగా ఉన్నాయి. ఈ నెలలో వచ్చినవే రూ.13,223 కోట్లు.
టీసీఎస్, ఇన్ఫీ షేర్లు విలవిల
దేశీయ ఐటీ రంగ దిగ్గజ సంస్థలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ షేర్లు గత వారం భారీ నష్టాలనే చవిచూశాయి. సెనెక్స్ టాప్-10 సంస్థల్లో అత్యధికంగా మార్కెట్ విలువను కోల్పోయింది ఈ రెండు కంపెనీలే. మొత్తం ఈ 10 సంస్థల్లో ఐదింటి మార్కెట్ విలువ గత వారం రూ.1,97,958.56 కోట్లు హరించుకుపోయింది. ఇందులో టీసీఎస్దే గరిష్ఠంగా రూ.1,10,134.58 కోట్లుగా ఉన్నది. ఇక ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ.52,291.05 కోట్లు ఆవిరైపోయింది. ఇక టాప్-10 కంపెనీల్లో రిలయన్స్, ఎస్బీఐ, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువలు పెరిగాయి. రూ.90,735.11 కోట్లు ఎగిసింది. టీసీఎస్, ఇన్ఫోసిస్తోపాటు హిందుస్థాన్ యునీలివర్, ఎల్ఐసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సంస్థల మార్కెట్ విలువ తగ్గింది.
సెన్సెక్స్ టాప్-10 సంస్థల మార్కెట్ విలువ (రూ.కోట్లలో)