Akshaya Tritiya | ముంబై, ఏప్రిల్ 20 : బంగారం ధరల్లో ఇటీవలి పెరుగుదల.. ఈ ఏడాది అక్షయ తృతీయ (శనివారం) అమ్మకాలను తగ్గించవచ్చని నగల వ్యాపారులు అంచనా వేస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా 10 గ్రాములు ఏకంగా రూ.60,000పైకి పోయిన ది తెలిసిందే. ఈ క్రమంలోనే ఈసారి అక్షయ తృతీయ సేల్స్ 20 శాతం పడిపోవచ్చని జ్యుయెల్లర్స్ అభిప్రాయపడుతున్నారు. ‘ఇటీవల 10 గ్రాముల బంగారం ధర రూ.60, 000 దాటింది. దీంతో పసిడి కొనుగోళ్ల విషయంలో కస్టమర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితి అక్షయ తృతీయ విక్రయాలనూ ప్రభావితం చేసేలా కనిపిస్తున్నది’ అని అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి (జీజేసీ) చైర్మన్ శ్యామ్ మెహ్రా పీటీఐతో అన్నారు.
జీజేసీ మాజీ చైర్మన్, ఎన్ఏసీ జ్యుయెల్లర్స్ (చెన్నై) ఎండీ అనంత పద్మనాభన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘బంగారం ధరల్లో ఈ ఆకస్మిక పెరుగుదల ప్రభావం ఇప్పటికే మార్కెట్లో కనిపిస్తున్నది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అక్షయ తృతీయ రోజున సేల్స్ విలువ 10 శాతం, డిమాండ్ 20 శాతం క్షీణించవచ్చు’ అన్నారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో తులం పుత్తడి రూ.60,280 పలుకుతున్నది. ‘అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు శుభప్రదమని కోట్లాది భారతీయుల నమ్మకం. అయితే ఏ ఏడాదీ అక్షయ తృతీయ వేళ ఈ స్థాయిలో బంగారం ధరలు లేవు. గతకొద్ది రోజులుగా అమ్మకాలూ అంతంతమాత్రంగానే సాగుతున్నాయి’ అని ప్రపంచ స్వర్ణ మండలి భారతీయ విభాగం ప్రాంతీయ సీఈవో సోమసుందరం పీఆర్ అన్నారు.