Adani | న్యూఢిల్లీ, మార్చి 6: అదానీ గ్రూప్ వివాదంలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తీరుపై రిజర్వ్బ్యాంక్ మాజీ గవర్నర్ రఘరామ రాజన్ విరుచుకుపడ్డారు. అదానీ గ్రూప్ షేర్లలో భారీగా పెట్టుబడి చేసిన నాలుగు మారిషస్ ఫండ్స్ యజమానుల్ని ఇంతవరకూ ఎందుకు గుర్తించలేదంటూ సెబీని ఆయన ప్రశ్నించారు. మారిషస్ కేంద్రంగా పెట్టుబడి కార్యకలాపాలు కొనసాగిస్తున్న నాలుగు ఫండ్స్-ఎలారా ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్, క్రెస్టా ఫండ్, అల్బులా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్లు వాటివద్దనున్న 6.9 బిలియన్ డాలర్ల నిధుల్లో 90 శాతం అదానీ గ్రూప్ షేర్లలో పెట్టుబడి చేసినట్టు సమాచారం. అవి అదానీ గ్రూప్ షెల్ కంపెనీలన్న ఆరోపణలు రెండేండ్లుగా విన్పిస్తున్నాయి.
ఈ జనవరిలో అమెరికా హెడ్జ్ హిండెన్బర్గ్ విడుదల చేసిన రిపోర్ట్తో ఈ ఫండ్స్పై మళ్లీ మార్కెట్ దృష్టిపడింది. షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచడానికి అదానీ గ్రూప్ విదేశాల్లో ఉన్న డొల్ల కంపెనీలను ఉపయోగించుకున్నదంటూ హిండెన్బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల్ని అదానీ గ్రూప్ సైతం ఖండించినదీ విదితమే. ఈ నేపథ్యంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ మాట్లాడుతూ ‘రెగ్యులేటర్లు వారిపని వారు చేయాలి. అదానీ షేర్లను ట్రేడ్ చేస్తూ, హోల్డ్ చేస్తున్న మారిషస్ ఫండ్స్ ఓనర్లు ఎవరో సెబీ ఇంకా ఎందుకు తేల్చలేదు? దానికి (సెబీ) ఇన్వెస్టిగేటివ్ సంస్థల (ఈడీ తదితర ఏజెన్సీలు) నుంచి సహాయం అవసరమా?’ అని ప్రశ్నలవర్షం కురిపించారు. అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణలపై తాను దర్యాప్తు చేస్తున్నట్టు సెబీ ఇటీవల సుప్రీంకోర్టుకు నివేదించగా, రెండు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలంటూ సుప్రీం బెంచ్ ఆదేశించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం చికాగో యూనివర్సిటీ బిజినెస్ స్కూల్లో ఫైనాన్స్ ప్రొఫెసర్గా వ్యవహరిస్తున్న రఘురామరాజన్ పీటీఐ ప్రతినిధికి ఇచ్చిన ఈ మెయిల్ ఇంటర్యూలో పలు దేశీయ అంశాలపై స్పందించారు. హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో ప్రైవేటు కుటుంబ వ్యాపారాల పారదర్శకతకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న ప్రశ్నకు రాజన్ బదులిస్తూ ‘ప్రైవేటు వ్యాపారాలు, కుటుంబ కంపెనీలు..అన్నింటినీ ప్రోత్సహించవచ్చు. కానీ ఏ ఒక్క ప్రమోటరూ అత్యంత శక్తివంతం కాకుండా ప్రతీ ఒక్కరికీ సమాన వేదిక కల్పించాలి’ అని అన్నారు. ‘ కొన్ని కుటుంబాలకే సన్నిహిత సంబంధాల్ని విధాన నిర్ణేతలు (అధికారంలో ఉన్నవారితో) కల్పిస్తే దేశానికి ఏ మాత్రం ప్రయోజనకరం కాదు. వ్యాపారాలు వాటి కనెక్షన్ల ద్వారా కాకుండా నైపుణ్యంతో వృద్ధిచెందనివ్వాలి’ అని రాజన్ చెప్పారు.
ప్రైవేటు రంగ పెట్టుబడుల తగ్గుదల, అధిక వడ్డీ రేట్లు, ప్రపంచ వృద్ధి మాంద్యం కారణంగా దీర్ఘకాలంపాటు భారత్ ఆర్థికాభివృద్ధి మందకొడిగానే ఉంటుందని రఘురామ రాజన్ హెచ్చరించారు. 2022 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు 4.4 శాతానికి తగ్గిందంటూ అధికారిక గణాంకాలు వెలువడటం ఆందోళనకరమని రిజర్వ్బ్యాంక్ మాజీ గవర్నర్ అన్నారు. 1950వ దశకం నుంచి 1980వ దశకం వరకూ సగటు వృద్ధి రేటు 4 శాతమే ఉన్నది. ఆ తరహా వృద్ధి బాటకు ఇండియా చాలా దగ్గర్లో ఉన్నదన్న ఆందోళన కలుగుతున్నదని రాజన్ వ్యాఖ్యానించారు. 2022 ఏప్రిల్-జూన్లో 13.2 శాతం, జూలై- సెప్టెంబర్లో 6.3 శాతంగా నమోదయ్యింది. ‘ వరుస త్రైమాసికాల్లో వృద్ధి తగ్గడం పట్ల నేను ఆందోళన చెందుతున్నా. ప్రైవేటు రంగం పెట్టుబడి చేయట్లేదు. ఆర్బీఐ ఇంకా వడ్డీ రేట్లు పెంచుతున్నది. ఈ ఏడాది అంతర్జాతీయ వృద్ధి తగ్గే అవకాశం ఉన్నది. ఈ ప్రతికూలాంశాలతో మనకు అదనపు వృద్ధి ఎక్కడ్నుంచి వస్తుంది?’ అంటూ రఘురామ రాజన్ సందేహం వ్యక్తం చేశారు.