Interest Rates | ఈ పండుగ సీజన్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏదైనా శుభవార్త చెప్తుందేమోనని అంతా భావించారు. కానీ ఇటీవల ముగిసిన ద్వైమాసిక ద్రవ్యవిధాన పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగానే ఉంచాలని నిర్ణయించింది. ద్రవ్యోల్బణం భయాల మధ్య నాల్గోసారీ వడ్డీరేట్ల కోతకు దూరంగానే సెంట్రల్ బ్యాంక్ ఉండాల్సి వచ్చింది. దీంతో ఈసారైనా వడ్డీ దెబ్బ నుంచి ఊరట కలుగుతుందేమోనని ఆశించినవారికి నిరాశే మిగిలింది. పరిశ్రమ అంచనాల ప్రకారం వచ్చే ఏడాది జూన్దాకా ఇంట్రెస్ట్ రేట్ల విషయంలో ఆర్బీఐ ఎలాంటి నిర్ణయమూ తీసుకునే అవకాశాల్లేవు.
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ధర 95 డాలర్ల స్థాయికి వెళ్లింది. అమెరికాలో పదేండ్ల ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్ 5 శాతానికిపైగానే ఉన్నాయి. దేశీయం గా కూడా ఆర్బీఐ బాండ్ ఈల్డ్స్ మరింతగా పెరిగాయి. బహిరంగ మార్కెట్ కార్యకలాపాల ద్వారా మార్కెట్లో ఉన్న లిక్విడిటీని కూడా తగ్గించడానికి ఆర్బీఐ ప్లాన్ చేస్తోంది. ఇక ద్రవ్యోల్బణం ఇప్పట్లో దిగేలా లేదు. ఇవన్నీ పరోక్షంగా వడ్డీరేట్లు తగ్గే అవకాశాలను దూరం చేస్తున్నాయి. అదే సమయంలో ఇంట్రెస్ట్ రేట్లు పెరిగే అవకాశాలు కూడా బాగా తక్కువ. ఇప్పటికే దాదాపుగా పీక్ స్టేజ్కి వడ్డీరేట్లు చేరుకున్నాయి మరి.
కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టిన తర్వాత ఆర్బీఐ ఏకంగా 2.50 శాతం వరకూ వడ్డీరేట్లను పెంచింది. ముఖ్యంగా ఏడాదిన్నర, రెండేండ్ల కిందట లోన్లు తీసుకున్నవాళ్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైందనే చెప్పాలి. గృహ రుణాలపై ఈఎంఐ భారం సుమారు 20 శాతందాకా పెరిగింది. ఈఎంఐ పెరగకపోతే, టెన్యూర్ కూడా గణనీయంగా పెరగడం చూశాం. 20 ఏండ్ల కాలపరిమితితో రూ.50 లక్షల హౌజింగ్ లోన్పై వడ్డీ భారం సుమారు రూ.12 లక్షల వరకూ పెరిగింది. వడ్డీరేట్లు 7 నుంచి 9.50 శాతానికి ఎగబాకడమే ఇందు కు కారణం. అయితే ఇప్ప ట్లో వడ్డీరేట్లు తగ్గడం కష్టంగానే కనిపిస్తోంది. అందుకే మనం చేయగలిగింది ప్రీ-పేమెంట్ ఆప్షన్ను తీసుకోవడం.
రాబోయే దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలు అమ్మకందార్లకు చాలా పెద్ద సీజన్. ఈ సమయంలో రుణాలకు డిమాండ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. కానీ అన్ సెక్యూర్డ్ లోన్స్ విపరీతంగా పెరుగుతున్నాయని, వీటికి అడ్డుకట్ట వేయాలని ఆర్బీఐ తాజా ద్రవ్యసమీక్షలో బ్యాంకులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో సులువుగా, వేగంగా దొరికే పర్సనల్ లోన్లకు బ్రేక్ పడొచ్చు. కనుక సిబిల్ స్కోర్ దెబ్బతినకుండా చూసుకోండి. వ్యక్తిగత రుణాలకు వడ్డీరేట్లు ఎక్కువ కాబట్టి, అవసరమైతేనే ముందుకెళ్లండి.
-నాగేంద్ర సాయి కుందవరం