Nitin Gadkari on EV | విద్యుత్ వాహనాల ధరలపై కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీపికబురందించారు. ఏడాది లోపు పెట్రోల్ వాహనాలతో సమాన స్థాయికి ఎలక్ట్రిక్ వాహనాల ధరలు దిగి వస్తాయని శుక్రవారం చెప్పారు. పెట్రోల్, డీజిల్లకు బదులు ఇథనాల్ వాడకాన్ని ప్రోత్సహిస్తుందని `టీవీ9- వాట్ ఇండియా థింక్ టుడే గ్లోబల్ సమ్మిట్`లో మాట్లాడుతూ అన్నారు. విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం పలు రాయితీలు అందిస్తున్న సంగతి తెలిసిందే.
`ఏడాదిలోపు దేశంలోని పెట్రోల్ వాహనాల ధరలతో సమాన స్థాయికి ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తీసుకొచ్చేందుకు నేను ప్రయత్నిస్తున్నా. తద్వారా పెట్రోల్, డీజిల్ల వాడకానికి ఉపయోగిస్తున్న మనీ ఆదా చేయొచ్చు` అని నితిన్ గడ్కరీ తెలిపారు.
భారీ స్థాయిలో గ్రీన్ ఫ్యూయల్స్ వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని నితిన్ గడ్కరీ అన్నారు. రోడ్డు రవాణా కంటే జల మార్గాలు చాలా చౌక, అని, ఆ దిశగా భారీ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.