Investors M-Cap | స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెరుగడంతో వరుసగా నాలుగు సెషన్ల ట్రేడింగ్ ర్యాలీతో ఇన్వెస్టర్లు రూ.12.74 లక్షల కోట్ల మేరకు సంపద పెంచుకున్నారు. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 5.15 శాతం పెరిగి 58 వేల మార్క్ను తిరిగి దాటేసింది. బీఎస్ఈ-30 సెన్సెక్స్ సోమవారం ట్రేడింగ్లో 545.25 (0.95 శాతం) పాయింట్ల లాభంతో 58,115.50 పాయింట్ల వద్ద ముగిసింది. గత నాలుగు సెషన్లలో సెన్సెక్స్ 2847.01 పాయింట్లు (5.15 శాతం) లాభ పడింది.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు దేశీయ స్టాక్మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడంతో స్థానిక ఇన్వెస్టర్లలో జోష్ను పెంచింది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,74,885.77 కోట్లు పెరిగి రూ.2,70,29,915.21 కోట్లకు దూసుకెళ్లింది. అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు, కార్ల విక్రయాలు పెరగడం.. దేశీయ స్టాక్ మార్కెట్ల ర్యాలీకి దోహద పడిందని కొటక్ సెక్యూరిటీస్ రిటైల్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ చెప్పారు. సోమవారం ఒక్కరోజే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,320.61 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు.
సోమవారం బీఎస్ఈ ట్రేడింగ్లో మహీంద్రా అండ్ మహీంద్రా స్క్రిప్ట్ 6.15 శాతం లాభాలతో టాప్లో నిలిచింది. గత నెలలో 33 శాతం కార్ల విక్రయాలు పెరిగాయని వార్తలు రావడంతో మహీంద్రా స్క్రిప్ట్పై ఇన్వెస్టర్లు మనస్సు పారేసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి సుజుకి, కొటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, అల్ట్రా టెక్ సిమెంట్ తదితర సంస్థలు లాభ పడ్డాయి.