Market Capitalisation | రెండు రోజుల నష్టాల తర్వాత గురువారం ట్రేడింగ్ తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ దాదాపు ఒక శాతం పుంజుకోవడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.3.24 లక్షల కోట్లు పుంజుకున్నది. బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 490.97 పాయింట్లు (0.69 శాతం) పుంజుకుని 71,847.57 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్ అంతర్గత ట్రేడింగ్లో 598.19 పాయింట్లు (0.89 శాతం) లబ్ధి పొందడంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,24,010.1 కోట్లు పెరిగి ఆల్ టైం హై రూ.3,68,32,843.41 కోట్లకు చేరుకున్నది. వృద్ధిరేటు పురోగతికి బ్యాంకింగ్ క్రెడిట్ గ్రోత్ సాధిస్తుందన్న అంచనాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండు రోజుల నష్టాల నుంచి బయట పడ్డాయి.
సొంతింటి కల సాకారం చేసుకునేందుకు భారతీయుల్లో డిమాండ్ పెరగడంతో రియాల్టీ రంగానికి లబ్ధి చేకూరిందని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. అత్యధిక ఇండ్ల రుణాలు పంపిణీ చేశామని బ్యాంకులు చెప్పడం దీనికి దోహద పడిందన్నారు.
బీఎస్ఈ సెన్సెక్స్లో బజాజ్ ఫైనాన్స్ 4.44 శాతం లబ్ధి పొందగా, ఎన్టీపీసీ స్టాక్ 3.54 శాతం పెరిగింది. ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, నెస్ట్లే, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర స్టాక్స్ భారీగా లబ్ధి పొందాయి. మరోవైపు హెచ్సీఎల్ టెక్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) స్టాక్స్ నష్టపోయాయి. ఏషియన్ మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు నష్టపోగా, ఈయూ మార్కెట్లు లబ్ధి పొందాయి. అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి.
దేశీయ మార్కెట్లలో బీఎస్ఈ మిడ్ క్యాప్ 1.49 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.04 శాతం లాభ పడ్డాయి. ఇండెక్స్ల్లో రియాల్టీ 6.61 శాతం, యుటిలిటీస్ 2.55, టెలికం 2.09, సర్వీసెస్ 1.68 శాతం, ఫైనాన్సియల్ సర్వీసెస్ 1.30 శాతం తదితర ఇండెక్స్లు లాభ పడితే, ఆటో, మెటల్ నష్టాలతో ముగిశాయి.