Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా ఐదో సెషన్లోనూ నష్టాలే నమోదయ్యాయి. ధరలను కట్టడి చేయడానికి అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లను పెంచనున్నదన్న భయాలు.. ఆసియా మార్కెట్లలో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు తమ నిధులు ఉపసంహరించుకోవడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలహీన పరిచాయి. మరోవైపు నెలవారీ డెరివేటివ్స్ ఎక్స్పైరీ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగింది. ఫలితంగా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 139.18 పాయింట్లు (0.23 శాతం) నష్టంతో 59,605.80 పాయింట్ల వద్ద స్థిర పడింది. అంతర్గత ట్రేడింగ్లో 59,960.04 పాయింట్ల గరిష్టానికి దూసుకెళ్లి, 59,406.31 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది సెన్సెక్స్. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం 43.05 (0.25 శాతం) పాయింట్ల పతనంతో 17,511.25 పాయింట్ల వద్ద సెటిలైంది.
సెన్సెక్స్లో ఏషియన్ పెయింట్స్, లార్సెన్ అండ్ టర్బో, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, పవర్గ్రిడ్, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ భారీగా నష్టపోయిన స్టాక్స్. మరోవైపు యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, ఐటీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, సన్ ఫార్మా తదితర స్క్రిప్ట్లు ప్రధానంగా లాభ పడ్డాయి.
చైనా, హాంకాంగ్ మార్కెట్లు నష్టాలతో ముగియగా, సౌత్ కొరియా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. జపాన్ స్టాక్ మార్కెట్లకు గురువారం సెలవు. ఈయూ మార్కెట్లు బుధవారం మధ్యాహ్నం ట్రేడింగ్లో లాభాలు గడించాయి. అమెరికా స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ధొరణి నమోదైంది. ఇక ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ రూ.82.73 వద్ద స్థిర పడింది. ఇంటర్నేషనల్ ఆయిల్ బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 0.32 శాతం పెరిగి బ్యారెల్పై 80.86 డాలర్ల వద్ద నిలిచింది. దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) బుధవారం రూ.579.82 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు.
గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్కు చెందిన 10 లిస్టెడ్ కంపెనీల్లో ఎనిమిది స్టాక్స్ నష్టాల్లోనే ముగిశాయి. అదానీ పవర్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ 5 శాతం చొప్పున నష్టపోయాయి. అదానీ విల్మార్క్ 3.41 శాతం, ఏసీసీ 0.81 శాతం, ఎన్డీటీవీ 0.25 శాతం నష్టపోయాయి. మరోవైపు అదానీ పోర్ట్స్ 1.19 శాతం, అంబుజా సిమెంట్స్ 0.69 శాతం లాభాలతో ముగిశాయి.
నిఫ్టీ-50లో ఏషియన్ పెయింట్స్, టైటాన్, దివిస్ లాబ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, బ్రిటానియా, భారతీ ఎయిర్టెల్ సహా 26 స్టాక్స్ నష్టపోయాయి. హిందాల్కో, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్ లబ్ధి గడించాయి.