PF | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) కేంద్ర ట్రస్టీల బోర్డు (సీబీటీ) ఈ ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) సొమ్ముపై వడ్డీరేటును 8 శాతంగానే నిర్ణయించవచ్చన్న అంచనాలున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఇది 8.15 శాతంగా ఉంటే, అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2021-22) 8.10 శాతంగానే ఉన్నది. అయితే ఈసారి ఇంకా తగ్గి 8 శాతానికే పరిమితం కావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండటం గమనార్హం.
మరోవైపు ఈ ఏడాది లోక్సభ ఎన్నికలున్నందున వడ్డీరేటును యథాతథంగా ఉంచేందుకే కేంద్ర ప్రభుత్వం మొగ్గుచూపుతుందన్న అభిప్రాయాన్నీ ఓ ఈపీఎఫ్వో బోర్డు సభ్యుడు వెలిబుచ్చారు. దీంతో శనివారం జరిగే 235వ సీబీటీ సమావేశంలో ఏం నిర్ణయిస్తారన్నది ప్రాధాన్యతను సంతరించుకున్నది.
ఇదిలావుంటే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులను పెంచేందుకు బోర్డు నుంచి ఈపీఎఫ్వో అనుమతుల్ని కోరే వీలు కూడా ఉన్నది. ప్రస్తుతం 10 శాతంగా ఉన్న పెట్టుబడుల పరిమితిని 15 శాతానికి పెంచాలన్నది ఈపీఎఫ్వో యోచన. దీనివల్ల పీఎఫ్ సొమ్ముపై మరింత రాబడులు అందుకోవచ్చంటున్నది. దీనిపై ట్రస్టీలు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే. ఈపీఎఫ్వోలో 6 కోట్లకుపైగా సభ్యులున్నారు. సీబీటీ సిఫార్సు చేసిన వడ్డీరేటును కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించి తుది ప్రకటనను విడుదల చేస్తుంది.