EPFO-Aadhaar | ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయం తీసుకున్నది. తమ సబ్స్క్రైబర్లు తమ జనన ధ్రువీకరణ కోసం సమర్పించే పత్రాల జాబితాలో ‘ఆధార్’ను తొలగించింది. ఇక నుంచి ఆధార్’ను ప్రాథమిక గుర్తింపు కార్డుగా మాత్రమే పరిగణిస్తామని తెలిపింది. భారత విశిష్ట ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది.
ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లు జనన ధ్రువీకరణ పత్రంగా సమర్పించడానికి ‘ఆధార్’ ప్రామాణికం కాదని ఈ నెల 16న జారీ చేసిన సర్క్యులర్లో సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ తెలిపారు. కనుక ఆధార్ ఆధారంగా తమ సబ్స్క్రైబర్ల పుట్టిన తేదీలో మార్పులు చేయలేమని ఈపీఎఫ్ఓ వెల్లడించింది.
జనన ధ్రువీకరణ పత్రంగా పరిగణించలేమని పలు కేసుల్లో కోర్టులు తీర్పులు చెప్పాయి. దీంతో జనన, మరణాల రిజిస్ట్రార్ జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రం అందుబాటులో లేకపోతే ఈ పత్రాలను సమర్పించవచ్చునని సూచించింది.
* జననాలు, మరణాల రిజిస్ట్రార్ జారీ చేసే జనన ధ్రువీకరణ పత్రం,
* కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ సర్వీస్ సంస్థల రికార్డుల ఆధారిత సర్టిఫికెట్,
* ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ లేదా యూనివర్సిటీ జారీచేసే మార్కుల జాబితా,
* ఎస్ఎస్సీ సర్టిఫికెట్ (పేరు, పుట్టిన తేదీ వివరాలు ఉంటే),
* స్కూల్ లేదా కాలేజీ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ),
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన పెన్షన్ పేమెంట్ సర్టిఫికెట్,
* ప్రభుత్వం జారీ చేసిన నివాస ధ్రువీకరణ పత్రం,
* పాన్ కార్డ్,
* పాస్ పోర్ట్,
* సివిల్ సర్జన్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికెట్.