న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: కరోనా పరిస్థితులు తగ్గుముఖం పడుతున్ననేపథ్యంలో దేశంలో హైరింగ్ సెంటిమెంట్ బలపడుతున్నది. ముఖ్యంగా ఉద్యోగావకాశాల్లో కొత్తవారికి ప్రాధాన్యం ఇవ్వాలన్న అభిప్రాయాలు కార్పొరేట్లలో క్రమేణా పెరుగుతున్నాయి. ‘కెరీర్ ఔట్లుక్ రిపోర్ట్’ పేరుతో టీమ్లీజ్ ఎడ్టెక్ విడుదల చేసిన తాజా నివేదిక ఒకటి ఇదే చెప్తున్నదిప్పుడు. దేశవ్యాప్తంగా 17 శాతం కంపెనీలు.. ఫ్రెషర్లను కొలువుల్లోకి తీసుకోవాలని యోచిస్తున్నాయి. ఈ జూలై-డిసెంబర్ నియామకాల్లో వారికి పెద్దపీట వేస్తున్నాయనీ టీమ్లీజ్ అంటున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి-ఏప్రిల్తో చూస్తే ఫ్రెషర్లకు ప్రాముఖ్యం కంపెనీ నియామకాల్లో 2 శాతం పెరిగినట్లు తెలిపింది.
ఐటీ (31 శాతం), టెలి కమ్యూనికేషన్ (25 శాతం), హెల్త్కేర్-ఫార్మా (23 శాతం), తయారీ (21 శాతం) రంగాల్లో హైరింగ్ సెంటిమెంట్ బలంగా కనిపిస్తున్నట్లు టీమ్లీజ్ రిపోర్టు స్పష్టం చేసింది. టెక్నాలజీ స్టార్టప్స్, లాజిస్టిక్స్ల్లోనూ డిమాండ్ ఉన్నది. అలాగే బెంగళూరు (43 శాతం), ముంబై (31 శాతం), ఢిల్లీ (27 శాతం), చెన్నై (23 శాతం), పుణె (21 శాతం)ల్లో ఫ్రెషర్లకు అధికంగా ఉద్యోగావకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 14 నగరాల్లోని 18 రంగాల్లో పరిస్థితుల ఆధారంగా ఈ రిపోర్టు తయా రైంది. ఈ సందర్భంగా ఉన్నత విద్యా విధానంలో మార్పులు రావాలని, బయటి పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉన్నదని టీమ్లీజ్ ఎడ్టెక్ ప్రెసిడెంట్, సహ వ్యవస్థాపకులు నీతి శర్మ అభిప్రాయపడ్డారు.
టీమ్లీజ్ ఎడ్టెక్ తాజా రిపోర్టు ప్రకారం ఇతర దేశాలతో పోల్చితే భారత్లోనే ఫ్రెషర్లకు కంపెనీ యాజమాన్యాలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. ఫ్రెషర్స్ హైరింగ్ సెంటిమెంట్లో అంతర్జాతీయ సగటు దాదాపు 6 శాతంగా ఉండగా, భారత్ మాత్రం 17 శాతంతో కనిపిస్తున్నదని ఈ రిపోర్టు తేల్చింది. ‘ఈ కొవిడ్-19 సంక్షోభంలోనూ ఫ్రెషర్ల హైరింగ్ సెంటిమెంట్ దేశంలో ఉత్సాహకరంగా ఉండటం ఆహ్వానించదగ్గ పరిణామం’ అని టీమ్లీజ్ ఎడ్టెక్ వ్యవస్థాపక సీఈవో శంతను రూజ్ అన్నారు. మరోవైపు దేశంలో అన్ని రంగాల్లో కొత్తవారిని లేదా అనుభవం ఉన్నవారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలన్న ఆకాంక్ష కంపెనీల్లో 27 శాతం నుంచి 31 శాతానికి పెరిగింది.
ఉద్యోగాల్లోకి కొత్తవారిని తీసుకునేందుకు ఆయా సంస్థలు మొగ్గు చూపుతున్నా.. నైపుణ్యం ఉంటేనే అవకాశం ఇస్తామని తేల్చిచెప్తున్నాయి. కాబట్టి ఫ్రెషర్లు ఎక్కువగా తమ స్కిల్ డెవలప్మెంట్పై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా డాటా అనలిటిక్స్పై నాలెడ్జ్ను పెంచుకోవాలంటున్నారు. కాగా, సేల్స్/కస్టమర్ సర్వీసెస్, డాటా ఇంజినీరింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, కృత్రిమ మేధస్సు, డిజిటల్ మార్కెటింగ్ వంటి రంగాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయని, కనుక వీటిపై పట్టు సాధించాలని రూజ్ హితవు పలుకుతున్నారు. ఇదిలావుంటే ప్రోగ్రామింగ్, మొబైల్ యాప్ డెవలప్మెంట్, ఏఐ, డాటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, రిసెర్చ్, మేనేజ్మెంట్ కోర్సులకు పెద్ద ఎత్తున డిమాండ్ కనిపిస్తున్నదన్నారు.