నల్లగొండ, ఏప్రిల్ 26 : లోక్సభ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్య వంశీ కోరారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం అయన రాజకీయ పార్టీలో ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా అన్ని పార్టీలకు అందిందా? ఏవైనా సమస్యలు ఉన్నాయా? ఎన్నికల ప్రవర్తనా నియమాలు పాటిస్తున్నారా? అని అడిగారు. ఎకడైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరిగినట్లయితే తక్షణమే తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈవీఎం ద్వారా పోలింగ్ రోజు నిర్వహించే మాక్ పోల్ విషయం ముందే తెలియజేశారా అని అడిగి తెలుసుకున్నారు. సి-విజిల్ యాప్, సువిధ తదితర అంశాల గురించి ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎన్నికల వ్యయ పరిశీలకుడు కళ్యాణ్ కుమార్ దాస్ మాట్లాడుతూ పోటీలో ఉన్న అభ్యర్థులు, పార్టీలు వారికి సంబంధించిన ఎన్నికల ఖర్చుల నిర్వహణను పకాగా నిర్వహించాలని, రిజిస్టర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ ప్రతినిధులు అన్ని అనుమతులను సింగిల్ విండో ద్వారా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నిల పోలీసు పరిశీలకుడు ఆమోఘ్ జీవన్ గాంకర్, జడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లోక్సభ ఎన్నికల సందర్భంగా నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ కేంద్రాన్ని, సోషల్ మీడియా, సువిధ, ఇంటిగ్రేటెడ్ డిస్టిక్ కంట్రోల్ రూమ్, సి విజిల్ తదితర విభాగాలను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు మనోజ్ కుమార్, ఎన్నికల వ్యయ పరిశీలకుడు కళ్యాణ్ కుమార్ దాస్, పోలీస్ పరిశీలకుడు అమోగ్ జీవన్ గాంకర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ నిర్వహిస్తున్న రిజిస్టర్లు, సోషల్ మీడియా ద్వారా ఇచ్చిన ప్రకటనల గుర్తింపు, పెయిడ్ న్యూస్ సానింగ్, రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి తదితర రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం సోషల్ మీడియా విభాగాన్ని సందర్శించి సోషల్ మీడియా పోస్టింగ్లను పరిశీలించారు. వారి వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్ఓ రాజ్యలక్ష్మి, ఎంసీఎంసి మెంబర్ సెక్రటరీ, డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు, జిల్లా ఇన్ఫర్మేటిక్ అధికారి గణపతిరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాకు ఎన్నికల పరిశీలకులను నియమించిన నేపథ్యంలో ఇద్దరు ఎన్నికలు పూర్తయ్యే వరకు జిల్లాలో అందుబాటులో ఉండనున్నారు. నల్లగొండ జిల్లాకు లోకసభ ఎన్నికల సాధారణ పరిశీలకుడుగా 2010 ఐఏఎస్ బ్యాచ్ అధికారి మనోజ్ కుమార్ మానిక్ రావు సూర్య వంశీ గురువారం నియమితులయ్యారు. ఆయన జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న ఆర్అండ్బీ అతిథి గృహంలో బస చేయనున్నారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే 9867383846 సెల్ నంబర్లో అందుబాటులో ఉంటారు. ఇక జిల్లాకు పోలీసు పరిశీలకుడిగా 2011 ఐపీఎస్ బ్యాచ్ అధికారి ఆమోఘ్ జీవన్ గాంకర్ నియమితులు కాగా ఆయన సైతం జిల్లాకు చేరుకుని పోలీస్ అతిథి గృహంలో ఉన్నారు. ఆయన 9922924971 ఫోన్ నంబర్లో అందుబాటులో ఉంటారు.