Mukesh Ambani Vs Elon musk | ఇప్పటివరకు శాటిలైట్ ఇంటర్నెట్ వ్యాపారంలో తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్న ముఖేష్ అంబానీకి రానున్న రోజుల్లో గట్టి పోటీ ఎదురుకానున్నది. ఒక కుబేరుడికి మరో కుబేరుడు పోటీగా నిలుస్తుండటంతో చర్చనీయాంశంగా మారింది. భారతదేశం నుంచి ఇంటర్నెట్ వ్యాపారం చేసేందుకు ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్ఎక్స్ దరఖాస్తు చేసుకున్నది. అయితే, లైసెన్స్ పొందడం అంత ఈజీ ఏం కాదని టెలికాం అధికారులు అంటున్నారు.
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్ భారతదేశంలో మొబైల్ సేవలను ప్రారంభించేందుకు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం లైసెన్స్ ఇవ్వాలంటూ భారత టెలికాం శాఖకు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. మొబైల్ ఉపగ్రహ సేవల కోసం ఎలాన్ మస్క్ ఏర్పాటు చేసిన స్పేస్ఎక్స్ కంపెనీ ద్వారా ఈ దరఖాస్తు దాఖలు చేసినట్లుగా తెలుస్తున్నది. ఈ సేవను గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ (జీఎంపీసీఎస్) అంటారు. భారతదేశంలోని టెలికాం శాఖలో ఇదే జీఎంపీసీఎస్ లైసెన్స్ కోసం స్పేస్ఎక్స్ దరఖాస్తు దాఖలు చేసింది. ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధి ఒకరు ధ్రువీకరించారు.
భారతదేశంలో తమ వ్యాపారాన్ని పెంచుకోవాలనుకునే చాలా కంపెనీలు శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ కోసం రేసులో ఉన్నాయి. వాటిలో జియో, వన్వెబ్, టాటా గ్రూప్కు చెందిన నెల్కో, కెనడాకు చెందిన టెలిసాట్, అమెజాన్ ఉన్నాయి. అయితే, ఇప్పటివరకు స్పేస్ఎక్స్తో కలిసి కేవలం మూడు కంపెనీలే టెలికాం శాఖ నుంచి లైసెన్స్ కోసం దరఖాస్తు చేశాయి.
జీఎంపీసీఎస్ లైసెన్స్ పొందడం అంటే స్పేస్ఎక్స్ కంపెనీ త్వరలో భారతదేశంలో తన సేవలను ప్రారంభిస్తుందని అర్థం కాదని అంటున్నారు టెలికాం సంస్థ ఉన్నతాధికారులు. భారత టెలికాం శాఖ నుంచి అనుమతి పొందిన తర్వాత.. అంతరిక్ష మంత్రిత్వ శాఖ నుంచి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వారు చెప్పారు. ఆ తర్వాతనే స్పెక్ట్రమ్ కేటాయిస్తారని, అప్పుడే సర్వీసులను ప్రారంభించవచ్చని వారంటున్నారు. దీనికి చాలా సమయం పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.