Elon Musk | న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: అమెరికాకు చెందిన విద్యుత్తు ఆధారిత కార్ల తయారీ దిగ్గజం టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఈ నెల భారత్కు రానున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా దేశంలో టెస్లా పెట్టుబడులపై ఓ ప్రకటన వచ్చే వీలుందని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. ఈ నెల 22 నుంచి 27 మధ్య మస్క్ భారత పర్యటన ఉండొచ్చని అంటున్నారు. ఆయన వెంట కంపెనీకి చెందిన ఇతర ఉన్నతాధికారులు కూడా ఉంటారని తెలుస్తున్నది. కాగా, గత ఏడాది జూన్లో అమెరికా పర్యటన సందర్భంగా మోదీతో మస్క్ భేటీ అయ్యారు. అప్పుడే ఈ ఏడాది భారత్లో పర్యటిస్తానని, దేశీయ మార్కెట్లోకి టెస్లాను తీసుకురావాలనుకుంటున్నానని మస్క్ ప్రకటించిన సంగతీ విదితమే. ఇదిలావుంటే కేంద్ర ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీని ప్రకటించిన కొద్ది వారాల్లోనే మస్క్ భారత్కు వస్తుండటం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నది.
నిజానికి భారత్లో పన్నులు ఎక్కువని, వాటిని తగ్గించాలని, ఈ విషయంలో మెట్టు దిగితేనే ఇక్కడ పెట్టుబడులను ఆలోచిస్తానని మస్క్ గతంలోనే చెప్పారు. ఈ క్రమంలో కనీసం 500 మిలియన్ డాలర్ల పెట్టుబడితో భారత్లో తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తే దిగుమతి సుంకాలపై రాయితీలు వర్తించేలా కొత్త పాలసీని మోదీ సర్కారు తెచ్చింది. మరోవైపు టెస్లా తాము భారత్లో ఏర్పాటు చేయబోయే ప్లాంట్కు అనువైన ప్రాంతాన్ని అన్వేషించేందుకూ ఈ పర్యటనను చేస్తున్నదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర మాజీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. టెస్లా ప్రతినిధులతో చర్చలు జరిపి రాష్ట్రంలో ప్లాంట్ ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.