ElonMusk-Twitter | గతేడాది ట్విట్టర్ను టేకోవర్ చేశాక.. ఆ సంస్థ సీఈవోగా ఎలన్మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు సిబ్బందితోపాటు కస్టమర్లనూ ఆశ్చర్య చకితుల్ని చేస్తున్నాయి. గతేడాది అక్టోబర్లో మొదలైన ఉద్యోగుల ఉద్వాసన ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. ఇదిలా ఉంటే ట్విట్టర్ వెరిఫికేషన్ బ్యాడ్జి కావాలనుకునే యూజర్లు ఫీజు చెల్లించాలని ట్విట్టర్ ఖాతాదారులకు షాక్ ఇచ్చారు. తొలుత సిబ్బంది.. అటుపై వినియోగదారులకు వరుసగా షాక్లు ఇస్తూ వచ్చిన ఎలన్మస్క్.. ఉద్యోగులకు మొదటిసారి గుడ్ న్యూస్ చెప్పారు.
బాగా పని చేసిన ఉద్యోగులను ప్రోత్సహించేందుకు సంస్థ షేర్లు కేటాయిస్తామని ఎలన్మస్క్ ప్రకటించారని ట్విట్టర్ ఉద్యోగి ఒకరు చెప్పారు. ఈ విషయాన్ని మెయిల్ ద్వారా ఉద్యోగులకు ఎలన్మస్క్ తెలియజేశారని సమాచారం. ఇలా ఉద్యోగులకు ప్రోత్సాహకంగా కేటాయించే షేర్ల విలువ 2000 కోట్ల డాలర్లు. అంటే ట్విట్టర్ కొనుగోలు చేయడానికి ఖర్చు చేసిన మొత్తంలో దాదాపు సగం. 4400 కోట్ల డాలర్లకు ట్విట్టర్ను ఎలన్మస్క్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ట్విట్టర్ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ఎలన్మస్క్ తీసుకున్న నిర్ణయం వెనుక భారీ కారణమే ఉందని పలువురు మాజీ ట్విట్టర్ ఉద్యోగులు అంటున్నారు. చాలా మంది ఉద్యోగుల తొలగింపు తర్వాత మస్క్ తీరుపై అసంతృప్తితో నైపుణ్యం గల ప్రొఫెషనల్స్ రాజీనామా చేస్తున్నారు. దీన్ని నిలువరించేందుకే.. ట్విట్టర్ షేర్లు కేటాయింపు అంశం ముందుకు తెచ్చారంటున్నారు. అసలు ఆ షేర్లు ఏ స్థాయి ఉద్యోగులకు కేటాయిస్తారన్నది స్పష్టత లేదు. ఉద్యోగులకు కేటాయించిన షేర్లు నాలుగేండ్ల తర్వాత అమ్మేసుకోవచ్చునట.
ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ట్విట్టర్ షేర్లు కేటాయిస్తామని పంపిన మెయిల్కు ముందే.. ప్రతి ఉద్యోగి కూడా ఆఫీసుకు రావాల్సిందేనని పేర్కొన్నారట. ఉద్యోగులంతా ఆఫీసులకు రావాలని అదీ కూడా అర్థరాత్రి 2.30 గంటల తర్వాత మెయిల్ పంపారట. కొద్ది రోజుల క్రితం శాన్ఫ్రాన్సిస్కో కార్యాలయంలో సగం మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హో చేయడంతో ఆఫీసు ఖాళీగా ఉందని ఎలన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ట్విట్టర్ను టేకోవర్ చేసినప్పటి నుంచి ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న ఎలన్మస్క్.. ప్రతి ఒక్కరూ వారానికి కనీసం 40 గంటలు పని చేయాల్సిందేనని హుకూం జారీ చేశారు.