Electric Vehicles | న్యూఢిల్లీ, మే 23: విద్యుత్తు ఆధారిత వాహన (ఈవీ) పరిశ్రమపై పిడుగు పడింది. ఎలక్ట్రిక్ టూవీలర్లపై సబ్సిడీకి కోత పెడుతున్నట్టు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాజాగా ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఇన్ ఇండియా)-2 పథకం కింద అందిస్తున్న రాయితీని తగ్గిస్తూ మార్పులు చేసినట్టు, వచ్చే నెల 1 నుంచి రిజిస్టరయ్యే ఎలక్ట్రిక్ టూవీలర్లకు ఈ సవరణలు వర్తిస్తాయని సదరు మంత్రిత్వ శాఖ అందులో స్పష్టం చేసింది. దీంతో ఈ మేరకు విద్యుత్తు ఆధారిత ద్విచక్ర వాహనాల ధరలు పెరగనున్నాయి. జూన్ 1 నుంచి వాహన ధరలు రూ.10,000 నుంచి 40,000 వరకు పెరగవచ్చన్న అంచనాలు ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్నాయి.
ఎలక్ట్రిక్ టూవీలర్లకు అందిస్తున్న సబ్సిడీలో ఇలా ఆకస్మికంగా కోత పెట్టడం సరికాదని పరిశ్రమ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఈ నిర్ణయం వాహనాల ధరలు పెరగడానికి దారితీస్తుందని, భారీగా అమ్మకాలూ పడిపోవచ్చని ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల సంఘం (ఎస్ఎంఈవీ) మంగళవారం ఆందోళన వెలిబుచ్చింది. ఇదే జరిగితే మొత్తం పరిశ్రమ కోలుకోవడానికి చాలా ఏండ్లే పడుతుందని, ఆ దుష్ప్రభావాలు కేవలం మా ఈ రంగంపైనేగాక దేశ ఆర్థిక వ్యవస్థపైనే కనిపిస్తాయని హెచ్చరించింది.
ఫేమ్-2 పథకం కింద ఒక్కో ఈవీ టూవీలర్కు దాని ఎక్స్-ఫ్యాక్టరీ ధరలో గరిష్ఠంగా 40 శాతానికి సమానంగా సబ్సిడీని అందిస్తున్నారు. కానీ ఇకపై దీన్ని 15 శాతానికి పరిమితం చేయాలని మోదీ సర్కారు నిర్ణయించింది. దీంతో సబ్సిడీలో ఒక్కసారిగా 25 శాతం కోత పడుతున్నదన్నమాట. కిలోవాట్కు రూ.15,000 కాకుండా రూ.10,000 మాత్రమే ఇస్తామంటున్నది. ఇప్పుడిప్పుడే ఈవీ టూవీలర్ల కొనుగోళ్లు ఊపందుకుంటున్న సమయంలో ఈ రాయితీల తగ్గింపు.. వాహనం ధరను భారీగా పెంచగలదని, ఇదే జరిగితే మార్కెట్ మొత్తం పడిపోతుందని కంపెనీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ అదనపు భారంతో కొనుగోలుదారులు మళ్లీ ఇంధన ఆధారిత వాహనాల వైపే చూడవచ్చని, తమకు నష్టాలు తప్పవని, పెట్టుబడులూ వృథానేనంటున్నారు. ప్రస్తుతం పెట్రో టూవీలర్ల ధర లక్ష రూపాయలకు దిగువనే ఉండగా, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఈవీ టూవీలర్ల ధర రూ.1.5 లక్షలు దాటిపోనున్నది మరి.
బెంగళూరు, మే 23:దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ సింపుల్ వన్..సరికొత్త స్కూటర్ను మార్కెట్కు పరిచయం చేసింది. ఒక్కసారి చార్జింగ్తో 212 కిలోమీటర్లు ప్రయాణించే ఈ స్కూటర్ కోసం ముందస్తు బుకింగ్లు ఆరంభించింది సంస్థ. ప్రారంభ ధర రూ.1.45 లక్షలు నిర్ణయించిన సంస్థ..గరిష్ఠంగా రూ.1.58 లక్షలు. వచ్చే ఏడాదికాలంలో దేశవ్యాప్తంగా 40 నుంచి 50 నగరాల్లో 160-180 రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నది. కేవలం 2.77 సెకండ్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది.
మార్కెట్ను ఎల్లప్పుడూ ధరలే శాసిస్తాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఎలక్ట్రిక్ టూవీలర్ల ధరలు భారీగా పెరగవచ్చు. దీనివల్ల మొత్తం పరిశ్రమే కుదేలయ్యేలా ఉన్నది’
-సోహిందర్ గిల్, ఎస్ఎంఈవీ డైరెక్టర్ జనరల్