హైదరాబాద్, మే 27: ఈబీజీ గ్రూపు హైదరాబాద్లో తయారీ, అసెంబ్లింగ్, డిస్ట్రిబ్యూషన్ హబ్ను నెలకొల్పింది. రూ.25 కోట్ల పెట్టుబడితో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ యూనిట్ను వజ్రం ఎలక్ట్రిక్ పేరుతో నిర్వహించనున్నది. ఇప్పటకే కంపెనీకి నగరంలో అడ్వాన్స్డ్ అసెంబ్లింగ్ యూనిట్ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంతోపాటు గ్రూపు వ్యాపారాన్ని మరింత విభాగాలకు విస్తరించాలనే ఉద్దేశంతో ఈ యూనిట్ను నెలకొల్పినట్టు ఈబీజీ గ్రూపు ఫౌండర్ ఇర్ఫాన్ ఖాన్ తెలిపారు. ప్రారంభ పెట్టుబడి కింద రూ.25 కోట్ల నిధులు వెచ్చించినట్టు, భవిష్యత్తులో మరింత పెట్టుబడి పెట్టనున్నట్టు చెప్పారు. ఈ యూనిట్తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 450 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, నిర్మాణ, ఎఫ్అండ్బీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆతిథ్య రంగంలో సంస్థ సేవలు అందిస్తున్నది.