ముంబై, నవంబర్ 15: మార్కెట్ విలువ జూమ్ స్టాక్ మార్కెట్ల భారీ లాభాలతో మదుపరుల సంపద పెద్ద ఎత్తున పెరిగింది. బుధవారం ఒక్కరోజే బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.3.29 లక్షల కోట్లు ఎగబాకింది. రూ.3,29,520.27 కోట్లు ఎగిసి రూ.3,25,40,108.97 కోట్లకు చేరింది. విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) మార్కెట్లలోకి పెట్టుబడులు తీసుకురావడం కలిసొచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, మంగళవారం మార్కెట్లకు సెలవు అవగా, సోమవారం సెన్సెక్స్ 326 పాయింట్లు కోల్పోయిన విషయం తెలిసిందే. నిఫ్టీ కూడా82 పాయింట్లు దిగజారింది. ఈ నేపథ్యంలో బుధవారం మార్కెట్లు ఈ స్థాయిలో పరుగులు పెట్టడం ఇన్వెస్టర్లకు లాభించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల మోత మోగించాయి. అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఐటీ, బ్యాంకింగ్, చమురు-గ్యాస్ రంగాల షేర్లు మదుపరులను అమితంగా ఆకట్టుకున్నాయి. ధరలు దిగొస్తే మున్ముందు ద్రవ్యసమీక్షల్లో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు ఇన్వెస్టర్లలో బలంగా ఉండటమే ఇందుకు కారణం. అంతేగాక దేశీయంగానూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కూ వడ్డీరేట్ల కోతకు వీలు కలుగుతుందన్న ఆశాభావం నెలకొన్నది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీలు ఒక శాతానికిపైగా పుంజుకున్నాయి. నిజానికి ఉదయం ఆరంభం నుంచే సూచీలు భారీ లాభాల్లో మొదలయ్యాయి. సమయం గడుస్తున్నకొద్దీ అంతకంతకూ పెరుగుతూపోయాయి. దీంతో సెన్సెక్స్ 742.06 పాయింట్లు లేదా 1.14 శాతం ఎగిసి 65వేల మార్కును దాటి 65,675.93 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 813.78 పాయింట్లు ఎగబాకడం విశేషం. నిఫ్టీ సైతం 231.90 పాయింట్లు లేదా 1.19 శాతం అందుకుని 19,675.45 వద్ద నిలిచింది.
రియల్టీ షేర్లు ఆకర్షణీయం
రియల్ ఎస్టేట్ షేర్లు అత్యధికంగా 2.97 శాతం పెరిగాయి. ఆ తర్వాత ఐటీ (2.29 శాతం), టెక్నాలజీ (2.12 శాతం), ఆటో (1.65 శాతం), చమురు-గ్యాస్ (1.55 శాతం), ఎనర్జీ (1.41 శాతం) రంగాల షేర్లు లాభపడ్డాయి. అలాగే బీఎస్ఈ స్మాల్క్యాప్ సూచీ 1.13 శాతం, మిడ్క్యాప్ సూచీ 0.91 శాతం చొప్పున పెరిగాయి. ఈసారి పండుగ సీజన్లో అమ్మకాలు ఆకర్షణీయంగా జరుగడం, ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) రెండో త్రైమాసికానికి (జూలై-సెప్టెంబర్)గాను కార్పొరేట్ సంస్థలు ప్రకటిస్తున్న ఆర్థిక ఫలితాలు బాగుండటం కలిసొచ్చిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ద్రవ్యోల్బణ గణాంకాలు దిగువముఖం పట్టడం కూడా మార్కెట్ సెంటిమెంట్ను బలపర్చిందని వ్యాఖ్యానించారు. ఇక షేర్లవారీగా చూస్తే.. టెక్ మహీంద్రా షేర్లు గరిష్ఠంగా 3.77 శాతం లాభపడ్డాయి. టాటా మోటర్స్, ఇన్ఫోసిస్, విప్రో, టాటా స్టీల్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్ షేర్లూ పెరిగాయి.
గ్లోబల్ మార్కెట్లలో..
ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లలోనూ లాభాలు నమోదవడం.. దేశీయ స్టాక్ మార్కెట్ల ఆరంభానికి కొత్త ఉత్సాహాన్ని అందించింది. ఇక మంగళవారం అమెరికా మార్కెట్లు భారీ లాభాలను సొంతం చేసుకోవడం కూడా ఇక్కడి మార్కెట్ సెంటిమెంట్ను బలపర్చినట్టు చెప్తున్నారు.
మార్కెట్ లాభాలకు కారణాలు