(స్పెషల్ టాస్క్ బ్యూరో): ‘వ్యాపారం చేయడం మా పనికాదు. దేశంలో ఆకలి కేకలు లేకుండా చూడటం, పేదలకు ఇండ్లు, మరుగుదొడ్లు నిర్మించడం, కనీస మౌలిక వసతులు కల్పించడం, చిన్న రైతుల సంక్షేమం గురించి ఆలోచించడమే మా ప్రాధాన్యత’ – ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్ ప్రతిపాదన సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణను సమర్థిస్తూ పార్లమెంట్లో ప్రధాని నరేంద్రమోదీ పలికిన సుభాషితాలివి.
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఎనిమిదేండ్ల మోదీ పాలనలో దేశవ్యాప్తంగా నిరుద్యోగం మునుపెన్నడూ లేనివిధంగా పెచ్చరిల్లుతున్నది. ఆకలి సూచీ, స్థిరాభివృద్ధి, పేదలకు వసతుల కల్పనలో దేశ పరిస్థితి నానాటికీ దిగజారుతున్నది. ఈ సమస్యలను గాలికొదిలేసిన మోదీ సర్కారు.. ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్యూ) తెగనమ్మడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. 1991 నుంచి ప్రభుత్వాలు జరిపిన పెట్టుబడుల ఉపసంహరణలో మోదీ సర్కారు వాటా 72 శాతంగా ఉన్నది.
ఈ ఉపసంహరణల ద్వారా మోదీ ప్రభుత్వం రూ.4.48 లక్షల కోట్లు రాబట్టుకొన్నది. ప్రస్తుత ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొంటే ఈ రాబడి రూ.6.19 లక్షల కోట్ల మేరకు ఉంటుందని రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్మెంట్ (డీఐపీఏఎం) తేల్చాయి. 1991 నుంచి 2022 వరకు వార్షిక ద్రవ్యోల్బణ రేటును 6 శాతంగా లెక్కలోకి తీసుకొని ఈ అంచనా వేశాయి. దీన్ని బట్టి ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ సర్కార్ ఎంతగా తెగనమ్ముతున్నదో అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ గురించి 1991-92 మధ్యంతర బడ్జెట్లో నాటి ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు. ఆ తర్వాత వచ్చిన సంకీర్ణ ప్రభుత్వాలు 1991-99 మధ్యకాలంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.17,557 కోట్లు ఆర్జించాయి. 1999 నుంచి 2004 వరకు వాజపేయి ప్రభుత్వం రూ. 27,599 కోట్లు.. 2004-14 మధ్య రెండుసార్లు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం రూ.1.33 లక్షల కోట్లు రాబట్టుకొన్నాయి. అనంతరం 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
పీఎస్యూల్లో పెట్టుబడుల ఉపసంహరణ ఆకాశమే హద్దుగా సాగింది. 2014-19 మధ్యకాలంలో మోదీ సర్కారు పీఎస్యూల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.3.2 లక్షల కోట్లు పిండుకొన్నది. ప్రస్తుత లెక్కల ప్రకారం ఇది రూ.4.7 లక్షల కోట్లకు సమానం. ఆ తర్వాత 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత సెప్టెంబరు వరకు వరకు మోదీ సర్కారు మరో రూ.1.26 లక్షల కోట్ల (ప్రస్తుత లెక్కల ప్రకారం రూ.1.48 లక్షల కోట్ల) పెట్టుబడులను ఉపసంహరించింది. అంటే, మోదీ ప్రభుత్వం గత ఎనిమిదేండ్లలో మొత్తం రూ.4.48 లక్షల కోట్లు (ప్రస్తుత ద్రవ్యోల్బణ రేటును పరిగణనలోకి తీసుకొంటే రూ.6.19 లక్షల కోట్లు) రాబట్టుకొన్నది. ఈ లెక్కన 1991 నుంచి ఇప్పటివరకు జరిగిన మొత్తం పెట్టుబడుల ఉపసంహరణలో మోదీ సర్కార్ వాటా 72 శాతంగా ఉన్నది.
దేశంలో నిరుద్యోగిత రేటు పెరిగింది. సెప్టెంబర్లో 6.43 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు ఆక్టోబర్కు 7.77 శాతానికి చేరిందని సెంటర్ ఫర్ మాని టరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ (సీఎం ఐఈ) వెల్లడించింది. మోదీ పగ్గాలు చేపట్టినప్పుడు నిరుద్యోగిత రేటు 5.44 శాతంగా ఉండటం గమనార్హం. మరోవైపు, గడిచిన ఎనిమిదేండ్లలో మోదీ హయాంలో దేశవ్యాప్తంగా 7.84 లక్షల రిజిస్టర్డ్ కంపెనీలు మూతబడ్డట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్స్ మేనేజ్మెంట్ నివేదికలో వెల్లడైంది.