ముంబై, జూలై 25: కొవిడ్తో అల్లాడిపోయిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈలు) రావల్సిన బకాయిలు కుప్పలుగా పేరుకుపోవడంతో మరింత కుదేలయ్యాయి. ఇందులో ప్రత్యేకించి సూక్ష్మ,చిన్న తరహా పరిశ్రమలకు వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూలు), బడా ప్రైవేట్ కంపెనీల నుంచి రూ. 8.73 లక్షల కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి.
మొత్తం ఎంఎస్ఎంఈ రంగానికి రూ. 10.7 లక్షల కోట్లు బకాయిలు రావాల్సి ఉండగా, ఇందులో సూక్ష్మ, చిన్న పరిశ్రమలవే 80 శాతం కావడం గమనార్హం. ఈ బకాయిలు వాటి మొత్తం అమ్మకాల ఆదాయంలో 65.73 శాతమని గ్లోబల్ అలియన్స్ ఫర్ మాస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ తెలిపింది. ఈ వివరాల్ని కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు నివేదించింది.
రూ.1 కోటి వరకూ పెట్టుబడితో రూ. 5 కోట్లలోపు టర్నోవర్ కనపర్చేవాటిని మైక్రో యూనిట్లుగా, రూ. 10 కోట్ల పరిమితికి మించకుండా పెట్టుబడి చేసి రూ. 50 కోట్ల లోపు టర్నోవర్ సాధించేవాటిని స్మాల్ యూనిట్లుగా పరిగణిస్తారు. రూ. 20 కోట్ల వరకూ పెట్టుబడి చేసి, రూ. 100 కోట్ల లోపు టర్నోవర్ చేసే సంస్థల్ని మధ్యతరహా పరిశ్రమలుగా చూస్తారు.
కొవిడ్తో దేశంలోని ఎంఎస్ఎంఈ రంగం 3 శాతం మార్కెట్ వాటాను కోల్పోయిందని క్రిసిల్ నివేదిక తెలిపింది. ఇందులో సగానికిపైగా కమోడిటీ ధర లు పెరగడంతో లాభాల మార్జిన్లను నష్టపోయాయి. దీనికి తోడు వాటికి రావాల్సిన బకాయిలు తడిసిమోపెడయ్యాయి.
ఈ రంగానికి బకాయిల్ని చెల్లించాలంటూ ప్రభుత్వ రంగ సంస్థల్ని, టాప్-500 కంపెనీలను ప్రభుత్వం పదే పదే కోరుతున్నప్పటికీ, 2021 క్యాలండర్ సంవత్సరంలో ఈ బకాయిలు రూ. 10.7 లక్షల కోట్లకు చేరాయి. సూక్ష్మ పరిశ్రమలకు రూ. 4.29 లక్షల కోట్లు, చిన్న సంస్థలకు రూ.4.29 లక్షల కోట్ల బకాయిలు అందాల్సి ఉంది.