El Nino | న్యూఢిల్లీ, ఏప్రిల్ 25 : వ్యవసాయోత్పత్తుల దిగుబడుల్లో క్షీణత, పెరుగుతున్న ధరలతో ఎగిసిపడే ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ పరిణామాలపట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. వీటితో దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు పొంచి ఉంటుందన్న అభిప్రాయాన్ని మార్చి నెలకుగాను మంగళవారం నిర్వహించిన తమ నెలవారి ఆర్థిక సమీక్షలో వెలిబుచ్చింది.
అంచనాలు తలకిందులు కావచ్చు
వృద్ధిరేటు, ద్రవ్యోల్బణం వంటి కీలక అంశాలను వ్యవసాయ దిగుబడులు, పెరుగుతున్న ధరలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు అత్యధికంగా ప్రభావితం చేయగలవని ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పింది. ప్రతికూల ఫలితాలు వస్తే.. చివరకు జీడీపీ, ఇన్ఫ్లేషన్పై అంచనాలూ తలకిందులు కావచ్చని వ్యాఖ్యానించడం గమనార్హం. ‘ఇది చాలా ముఖ్యం. ఎల్నినో (El Nino) ప్రభావంతో దేశంలో కరువు పరిస్థితులు తలెత్తే అవకాశాలున్నాయి. వ్యవసాయోత్పత్తి పడిపోవచ్చు. ధరలు పెరుగవచ్చు. అలాగే భౌగోళిక రాజకీయ పరిణామాలు, అంతర్జాతీయ ఆర్థిక సుస్థిరతపై భయాల వంటి వాటిపట్ల అప్రమత్తత అవసరం’ అని ఈ రివ్యూలో ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొన్నది.
గృహస్తుల డిపాజిట్లే శ్రీరామ రక్ష
దేశీయ బ్యాంకింగ్ రంగానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్నది. డిపాజిట్లలో 63 శాతం గృహస్తులవేనని, వీటిల్లో ఇష్టారీతిన ఉపసంహరణలు ఉండబోవని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే అమెరికా, ఐరోపా బ్యాంకింగ్ సంక్షోభం.. భారత్లో తలెత్తబోదన్న విశ్వాసాన్ని కనబర్చింది. దేశీయ బ్యాంకుల ఆర్థిక పరిపుష్ఠి కూడా బాగానే ఉందని తెలియజేసింది. కాగా, గత ఆర్థిక సంవత్సరం (2022-23) వినియోగదారుల సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం 6.7 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2021-22) ఇది 5.5 శాతమే. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంటుందన్న ఆశాభావాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా సమీక్షలో కనబర్చింది.