Gold Smugling | శ్రీలంక నుంచి సముద్ర మార్గం ద్వారా అక్రమంగా తరలిస్తున్న 4.9 కిలోల బంగారాన్ని కోస్ట్ గార్డ్, కస్టమ్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ).. విభాగాల అధికారులు జాయింట్ ఆపరేషన్లో జప్తు చేశారు. రూ.3.43 కోట్ల విలువ గల బంగారాన్ని జప్తు చేసినట్లు తెలిపారు. ఇండియన్ కోస్ట్గార్డులు (ఐసీజీ), కస్టమ్స్ ప్రివెంటివ్ యూనిట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) సంయుక్తంగా సముద్రం మధ్యలో వెధలాయి కోస్తా తీరప్రాంతం మండపం వద్ద ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాయి. చేపల వేటకు వినియోగించే బోట్ ద్వారా వెధలాయి కోస్తా మీదుగా శ్రీలంక నుంచి భారత్కు బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారన్న సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాలకు అందింది.
ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం లభించడంతో డీఆర్ఐ, ఐసీజీ విభాగాల అధికారులు ఈ నెల మూడో తేదీ నుంచి నాలుగో తేదీ వరకూ కోస్తా తీర ప్రాంతంపై నిఘా పెట్టారు. ఏప్రిల్ నాలుగో తేదీ తెల్లవారుజామున సముద్ర మధ్య ఒక పడవ వస్తున్నట్లు గుర్తించారు. ఇండియా కోస్ట్గార్డ్స్ ఓడ ద్వారా వెళ్లి, ఆ పడవను, అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
వారిని పట్టుకునే లోపే పడవపై వస్తున్న ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు తమ వెంట తీసుకువస్తున్న లగేజీని సముద్ర జలాల్లో పడవేస్తున్న దృశ్యాలను అధికారులు చూశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో తమ నేరాన్ని అంగీకరించారు.సముద్ర గర్భంలో వెలికి చూడగా బంగారం బయట పడింది. శనివారం సముద్ర గర్భం నుంచి వెలికి తీసిన బంగారం ధర రూ.9.43 కోట్లు ఉంటుందని అంచనా.