Dow Jones | ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్ప కూలాయి. ద్రవ్యోల్బణం మరింత పెరిగిందని వాల్స్ట్రీట్ జర్నల్ వెల్లడించడంతో డోజోన్స్ సహా ప్రపంచ వ్యాప్త స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. డోజోన్స్ ఇండస్ట్రీయల్ ఏవరేజ్ 900 పాయింట్లు (2.8 శాతం) పతనం కాగా, ఎస్ అండ్ పీ-500.. 3.2 శాతం, నాస్డాక్ 4.1 శాతం నష్టపోయాయి. బాండ్ల ధరలు పడిపోయాయి. ఆర్థిక వేత్తల అంచనాలను మించి అమెరికాలో ఆగస్టు ద్రవ్యోల్బణం 8.3 శాతానికి పెరిగిపోయింది. ఈ వార్త వెలుగు చూడగానే ఎస్ అండ్ పీ 500లో 11 సెక్టార్ల షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఆపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి స్టాక్స్ నాలుగు శాతం వరకు నష్టపోయాయి. గూగుల్ ఇతర ఇంటర్నెట్, మీడియా స్క్రిప్ట్లు 4.5 శాతం వరకు కుప్పకూలాయి.
ద్రవ్యోల్బణంపై పోరుకు వడ్డీరేట్లు పెంచక తప్పదని అమెరికా ఫెడ్ రిజర్వు ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థకు ముప్పు తప్పదని తేల్చి చెప్పింది. అమెరికా ఫెడ్ రిజర్వు ప్రకటనతో వ్యాపారులు నిరాశకు గురయ్యారు. ఇప్పటి వరకు ద్రవ్యోల్బణం తగ్గుతుందని, ఈ ఏడాది చివరికల్లా వడ్డీరేట్ల పెంపు నిలిచిపోతుందని అనుకున్న ఇన్వెస్టర్లు, ఆర్థికవేత్తల ఆశలు అడియాసలయ్యాయి. ధరలను తగ్గించడానికి వడ్డీరేట్లు పెంచడం వల్ల ఆర్థిక మాంద్యానికి దారి తీస్తుందన్న భయాందోళనలు వ్యక్తం అయ్యాయి.