Market Pulse | దేశీయ స్టాక్ మార్కెట్లను వరుస నష్టాలు వీడటం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల హెచ్చరికలు.. మదుపరులను అమ్మకాల ఒత్తిడిలోకి నెడుతున్నాయి. దీంతో సూచీలు భారీ పతనాలను చవిచూస్తున్నాయి. గత వారం కూడా ఇదే జరిగింది. అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 2,112.96 పాయింట్లు లేదా 2.80 శాతం పతనమై 73,198.10 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 671.20 పాయింట్లు లేదా 2.94 శాతం క్షీణించి 22,124.70 దగ్గర స్థిరపడింది. నిజానికి ఫిబ్రవరి మొదలు భారతీయ ఈక్విటీలకు ఏమాత్రం కలిసిరావడం లేదు. కేంద్ర బడ్జెట్, ఆర్బీఐ ద్రవ్యసమీక్షలూ మెప్పించలేకపోయాయి.
ఈ నేపథ్యంలో ట్రంప్ సుంకాల ప్రకటనలు.. ఇన్వెస్టర్లను పెట్టుబడులకు మరింతగా దూరం చేస్తున్నాయి. ఈ వారం కూడా ఇదే తంతు కొనసాగవచ్చని మెజారిటీ నిపుణుల అంచనా. ఇక ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను విడుదలైన జీడీపీ గణాంకాలు నిరాశాజనకంగానే ఉన్నాయి. వీటి ప్రభావం కూడా ఈ వారం మార్కెట్ ట్రేడింగ్పై ఉండనున్నది. అటు ఎప్పట్లాగే డాలర్తో పోల్చితే ఆల్టైమ్ కనిష్ఠాల వద్ద కదలాడుతున్న రూపాయి మారకం విలువ.. మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీయవచ్చు. అలాగే గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ మదుపరుల పెట్టుబడులు, ముడి చమురు ధరలు, అంతర్జాతీయ పరిణామాలూ ముఖ్యమే. కాగా, అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 21,900 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 21,700 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 22,400-22,600 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడుదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.