దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. మదుపరులు లాభాల స్వీకరణకు పెద్దపీట వేశారు. ఆయా రంగాల షేర్లను దూరం పెడుతూ కొనుగోళ్లకు అంతగా ఆసక్తి కనబర్చలేదు. విదేశీ ఇన్వెస్టర్లు సైతం పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 626.01 పాయింట్లు లేదా 0.74 శాతం కోల్పోయి 83,432.89 వద్ద నిలిచింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 176.80 పాయింట్లు లేదా 0.68 శాతం పడిపోయి 25,461 దగ్గర స్థిరపడింది. అయితే రుతు పవనాలు ఇంకా దేశవ్యాప్తంగా విస్తరించకపోవడంతో వ్యవసాయంపై గుబులు పట్టుకుంటున్నది.
అలాగే పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ దాడులు ఇప్పటికీ కొనసాగుతుండటం కొంత ఆందోళనకరంగానే ఉన్నదని చెప్పవచ్చు. దీంతో ఇన్వెస్టర్లు ఈ వారం అమ్మకాల ఒత్తిడిలోనే ఉండవచ్చన్న అంచనాలైతే ఉన్నాయి. ఇక ఎప్పట్లాగే డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్ఐఐ) పెట్టుబడులు, దేశీయ మార్కెట్లను నిర్దేశించనున్నాయి. అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 25,100 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 24,900 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. కానీ సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 25,700-25,900 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.