ముంబై, జనవరి 5: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీగా నష్టపోయాయి. ఈ ఏడాదిలో మరిన్నిసార్లు వడ్డీరేట్లను పెంచకతప్పదని అమెరికా ఫెడరల్ రిజర్వు ఇచ్చిన సంకేతాలు మార్కెట్లను పతనం వైపు నడిపించాయి. మరోవైపు, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం మదుపరులు ఆందోళనకు గురయ్యారు. ఫలితంగా ప్రారంభం నుంచి అమ్మకాలకు మొగ్గుచూపిన పెట్టుబడిదారులు చివరి వరకు అదే తీరును కొనసాగించారు. ఇంట్రాడేలో 500 పాయింట్ల స్థాయిలో పతనమైన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 304.18 పాయింట్లు నష్టపోయి 60,353.27 వద్ద స్థిరపడింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 50.80 పాయింట్లు పడిపోయి 18 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. చివరకు 17,992.15 వద్ద ముగిసింది.