దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను సంతరించుకున్నాయి. అంతకుముందు వారాల్లో నష్టాలతో సరిపెట్టుకున్న సూచీలు.. గత వారం మాత్రం ఆకర్షణీయ వృద్ధిని అందుకున్నాయి. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే.. గత వారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,346.50 పాయింట్లు లేదా 1.61 శాతం ఎగబాకి 84,562.78 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 417.75 పాయింట్లు లేదా 1.64 శాతం ఎగసి 25,910.05 దగ్గర స్థిరపడింది. ఈ నేపథ్యంలో ఈ వారం మదుపరులు లాభాల స్వీకరణకు పెద్దపీట వేయవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మార్కెట్లు భారీగా పెరగడంతో ఆ లాభాలను ఒడిసి పట్టుకునేందుకు ఇన్వెస్టర్లు చూసే వీలుందని అంటున్నారు.
దీంతో ఆటో, మెటల్, బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురికావచ్చని మెజారిటీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ఎప్పట్లాగే గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ మదుపరుల పెట్టుబడులు, ముడి చమురు ధరలు, డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ, ఇతర అంతర్జాతీయ పరిణామాలు ముఖ్యమే. కాగా, అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 25,600 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 25,400 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 26,200-26,400 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు. అయితే మదుపరుల్లో గత వారం కనిపించిన జోష్ ఉంటే.. ఈ వారం సూచీలు ఆల్టైమ్ హైల్లోకి వెళ్లే అవకాశాలూ లేకపోలేదు.
గమనిక..
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.