ముంబై, మార్చి 1: దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చాయి. గతవారంరోజులుగా నష్టాలే పరమావధిగా కొనసాగిన సూచీలు బుధవారం ఒక్క శాతం వరకు కోలుకున్నాయి. ఆసియా, యూరప్ స్టాక్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీలకు ఉత్సాహాన్ని ఇచ్చాయి. లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు ఇదే ట్రెండ్ను కొనసాగించాయి. ఇంట్రాడేలో 500 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 448.96 పాయింట్లు ఎగబాకి 59,411.08 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 146.95 పాయింట్లు అధికమై 17,450.90 వద్ద స్థిరపడింది.
ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీ, టీసీఎస్, మారుతి, టాటా స్టీల్, టాటా మోటర్స్ లాభాల్లో ముగిశాయి.
ఎట్టకేలకు మదుపరుల సంపద పెరిగింది. గత ఎనిమిది సెషన్లుగా లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిన పెట్టుబడిదారుల సంపద బుధవారం రూ.3 లక్షల కోట్ల పైగా పెరిగింది. బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ విలువ రూ.3,20, 574.19 కోట్లు పెరిగి రూ.2,60,93,075 .59 కోట్లకు చేరుకున్నది.
ఎనిమిది సెషన్ల తర్వాత మార్కెట్లకు ఇది రిలీఫ్ ర్యాలీ. యూరోపియన్, ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చాయి.
– శ్రీకాంత్ చౌహాన్, కొటక్ సెక్యూరిటీ ఈక్విటీ రీసెర్చ్ హెడ్