దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు కోలుకున్నాయి. వరుస నష్టాల నుంచి గత వారం లాభాలబాట పట్టాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల హెచ్చరికలు.. మదుపరులను అమ్మకాల ఒత్తిడిలోకి నెడుతున్న విషయం తెలిసిందే. దీంతో సూచీలు భారీగా పడిపోతూ వచ్చాయి. అయితే గత వారం ఈ ధోరణికి విరామం ఇచ్చారు మదుపరులు. ఫలితంగానే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,134.48 పాయింట్లు లేదా 1.55 శాతం పుంజుకొని 74,332.58 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 427.80 పాయింట్లు లేదా 1.93 శాతం అందుకొని 22,552.50 దగ్గర ముగిసింది. యుటిలిటీస్, పవర్, సర్వీసెస్, మెటల్, టెలికం, కమోడిటీస్, చమురు-గ్యాస్, ఎఫ్ఎంసీజీ, హెల్త్కేర్ రంగాల షేర్లు ఆకర్షణీయంగా కనిపించడంతో ట్రంప్ టారిఫ్ భయాలను ఇన్వెస్టర్లు అధిగమించగలిగారు.
ఈ క్రమంలో ఈ వారం కూడా మార్కెట్లకు పెట్టుబడుల మద్దతు లభించవచ్చన్న అంచనాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ కోలుకుంటే మార్కెట్ సెంటిమెంట్ మరింతగా బలపడే వీలున్నది. అలాగే గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ మదుపరుల పెట్టుబడులు, ముడి చమురు ధరలు, అంతర్జాతీయ పరిణామాలూ ముఖ్యమే. కాగా, అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 22,300 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 22,100 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 22,900-23,200 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
గమనిక..: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడుదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఇన్వెస్టర్లదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.