ముంబై, అక్టోబర్ 27: దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాలను అందుకున్నాయి. వరుసగా 6 రోజులపాటు నష్టాల్లోనే కొట్టుమిట్టాడిన సూచీలు.. శుక్రవారం తిరిగి కోలుకున్నాయి. 1 శాతానికిపైగా పుంజుకోవడం గమనార్హం. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 634.65 పాయింట్లు లేదా 1.01 శాతం ఎగిసి 63,782.80 వద్ద నిలిచింది. ఒకానొక దశలోనైతే 63,913.13 స్థాయిని తాకింది. గత 6 రోజుల్లో సెన్సెక్స్ 3,279.94 పాయింట్లు పతనమైన విషయం తెలిసిందే. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 202.45 పాయింట్లు లేదా 1.07 శాతం ఎగబాకి 19,059.70 వద్ద స్థిరపడింది.
గత 6 రోజులుగా లాభాల స్వీకరణకే ప్రాధాన్యతనిచ్చిన మదుపరులు.. మళ్లీ పెట్టుబడులకు పెద్దపీట వేశారు. ఆటో, ఐటీ, ఆర్థిక, ఎనర్జీ రంగాల షేర్లు ఆకట్టుకోవడంతో భారీగా కొనుగోళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) రెండో త్రైమాసికానికి (జూలై-సెప్టెంబర్ లేదా క్యూ2)గాను ఆయా కార్పొరేట్ సంస్థలు తమ ఆర్థిక ఫలితాల్ని అంచనాలకు మించి ప్రకటించడం కూడా కలిసొచ్చిందని మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. మారుతీ, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ఫలితాలు బాగున్నాయని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే మిడిల్ ఈస్ట్ ఆందోళనల్నీ మదుపరులు పక్కనబెట్టి ఇన్వెస్టింగ్కే ఆసక్తి కనబర్చారని చెప్తున్నారు. అయితే అమెరికా జూలై-సెప్టెంబర్ జీడీపీ గణాంకాలు రెండేండ్ల గరిష్ఠాన్ని తాకుతూ 4.9 శాతంగా నమోదు కావడం కొంత కలిసొచ్చిందని అంటున్నారు. నిజానికి 4.2 శాతంగానే అంచనాలున్నాయని గుర్తుచేస్తున్నారు.
యుటిలిటీ షేర్లు 2.22 శాతం, పవర్ 2.04 శాతం, సర్వీసెస్ 1.79 శాతం, ఇండస్ట్రియల్ 1.63 శాతం, రియల్టీ 1.63 శాతం, ఐటీ 1.36 శాతం చొప్పున లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్ షేర్ విలువ అత్యధికంగా 3.07 శాతం పెరిగింది. హెచ్సీఎల్ టెక్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, టాటా మోటర్స్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్ షేర్లూ లాభపడ్డాయి. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ విలువ 1.75 శాతం పుంజుకొని రూ.2,265.25 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు సైతం దేశీయం గా మార్కెట్ సెంటిమెంట్ను బలపర్చాయని మెజారిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, చైనా, జపాన్, హాంకాంగ్ సూచీలు ఆకర్షణీయ లాభాలనే అందుకున్నాయి. అయితే ఐరోపా మార్కెట్లలో మాత్రం మిశ్రమ స్పందన కనిపించింది. బ్రిటన్, ఫ్రాన్స్ సూచీలు నష్టాల్లో, జర్మనీ లాభాల్లో ఉన్నాయి. గురువారం అమెరికా స్టాక్ మార్కెట్ నష్టపోయింది. కాగా, గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నా.. మదుపరులు దానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే మార్కెట్లు లాభపడ్డాయని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఎఫ్ఐఐలు శుక్రవారం రూ.1,500.13 కోట్ల పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్నట్టు ఎక్సేంజ్ గణాంకాలు చెప్తున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి రావడంతో మదుపరుల సంపద కూడా పెరిగింది. బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.4.41 లక్షల కోట్లకుపైగా పుంజుకున్నది. రూ.4,41, 152.35 కోట్లు ఎగబాకి రూ.3,10, 45,955.07 కోట్లకు చేరింది. గురువారం మార్కెట్లు ముగిసే సమయానికి రూ.3,06,04,802.72 కోట్లుగా ఉన్నది. అంతకుముందు 6 రోజుల్లో మదుపరుల సంపద ఏకంగా రూ.17.77 లక్షల కోట్లు ఆవిరైపోయిన విషయం తెలిసిందే. బీఎస్ఈ మిడ్క్యాప్ సూచీ 1.70 శాతం, స్మాల్క్యాప్ సూచీ 1.89 శాతం పెరిగాయి. కార్పొరేట్ కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు మదుపరుల్లో తిరిగి ఉత్సాహాన్ని నింపాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిసెర్చ్ అధిపతి వినోద్ నాయర్ అన్నారు.