ముంబై, జూన్ 8: దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లలో అలజడికి కారణంమైంది. ఫలితంగా చమురు ధరలు మళ్లీ పుంజుకోవడం, గ్లోబల్ మార్కెట్లు కుప్పకూలడంతో దేశీయ సూచీలు ఒక్క శాతానికి పైగా పతనం చెందాయి. వీటికితోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకోవడం, రూపాయి పతనం చెందడం కూడా పతనానికి ఆజ్యంపోశాయి.
ఇంట్రాడేలో వెయ్యి పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 719.08 పాయింట్లు నష్టపోయి 73,524.26 వద్దకు జారుకున్నది. మరో సూచీ నిఫ్టీ సైతం 243.70 పాయింట్లు కోల్పోయి 23,123 వద్ద ముగిసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో లక్షల కోట్ల మదుపరుల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.6,31,440.41 కోట్లు కరిగిపోయి రూ.4,55,28,758.96 కోట్లు (4.76 ట్రిలియన్ డాలర్లు)కు పడిపోయింది.