ముంబై, ఆగస్టు 17: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. వరుస లాభాలు రెండు రోజులకే పరిమితమవడంతో గురువారం సూచీలు పడిపోకతప్పలేదు. కొనుగోళ్లను పక్కనబెట్టి మదుపరులు లాభాల స్వీకరణకు పెద్దపీట వేశారు. అమ్మకాల ఒత్తిడితో ఉదయం నష్టాల్లోనే మొదలైన సూచీలు.. సమయం గడుస్తున్నకొద్దీ ఇంకా నీరసించిపోయాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ, లార్జ్క్యాప్ ఇండెక్స్ సెన్సెక్స్ 388.40 పాయింట్లు లేదా 0.59 శాతం క్షీణించి 65,151.02 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 493.32 పాయింట్లు దిగజారడం గమనార్హం. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 99.75 పాయింట్లు లేదా 0.51 శాతం కోల్పోయి 19,365.25 వద్ద స్థిరపడింది.
బడా షేర్లు ఢమాల్
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్), ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి ప్ర ముఖ షేర్లు కూడా మదుపరులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఐటీసీ షేర్ విలువ అత్యధికంగా 2.04 శాతం పతనమైంది. ఆర్ఐఎల్, పవర్గ్రిడ్, ఎల్అండ్టీ, నెస్లే, కొటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ తదితర షేర్లూ నిరాశపర్చాయి. రంగాలవారీగా యుటిలిటీస్ 1.03 శాతం, ఎఫ్ఎంసీజీ 0.93 శాతం, చమురు-గ్యాస్ 0.77 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.75 శాతం, పవర్ 0.73 శాతం, మెటల్ 0.25 శాతం షేర్లు పడిపోయాయి. బీఎస్ఈ స్మాల్క్యాప్ సూచీ 0.19 శాతం, మిడ్క్యాప్ సూచీ 0.06 శాతం చొప్పున నష్టపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో..
ప్రధాన ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, హాంకాంగ్ సూచీలు నష్టాల్లోనే ముగియగా.. చైనా మాత్రం లాభాలను అందుకున్నది. కీలక ఐరోపా మార్కెట్లూ నష్టాల్లోనే కదలాడాయి. అయితే బుధవారం అమెరికా మార్కెట్లు నష్టపోగా.. ఆ ప్రభావం భారత్సహా మెజారిటీ ఆసియా, ఐరోపా మార్కెట్లపై కనిపించిందని ట్రేడింగ్ సరళిని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం, కరెన్సీ లెవల్స్ పడిపోవడం.. మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయని వివరిస్తున్నారు. చైనాలో మందగించిన డిమాండ్, అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు భయాలు కూడా గ్లోబల్ మార్కెట్ ఉత్సాహాన్ని నీరుగారుస్తున్నాయంటున్నారు.