Stock Markets | ముంబై, జనవరి 30: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో సూచీలు లాభాలను కొనసాగించలేకపోయాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 801.67 పాయింట్లు లేదా 1.11 శాతం పడిపోయి 71,139.90 వద్ద నిలిచింది. ఒకానొక దశలోనైతే 865.85 పాయింట్లు దిగజారింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 215.50 పాయింట్లు లేదా 0.99 శాతం క్షీణించి 21,522.10 వద్ద స్థిరపడింది. సోమవారం రికార్డు స్థాయిలో లాభాలు అందుకున్న విషయం తెలిసిందే. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్), ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లను ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమ్మేశారు. ఈ క్రమంలోనే ఓవరాల్ ట్రేడింగ్పై ఈ ప్రభావం పడింది.
ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వస్తుండటంతో పెద్దగా నిర్ణయాలేమీ ఉండబోవన్న అంచనాకు వచ్చిన మదుపరులు సేఫ్ గేమ్ ఆడినట్టు మార్కెట్ ట్రేడింగ్ తీరును నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇందులో భాగంగానే ఫాగ్ ఎండ్ సెల్లింగ్ తీవ్రంగా జరిగిందని చెప్తున్నారు. ఆసియాలోని కీలక మార్కెట్లలోనూ నష్టాలు నమోదు కావడం, వడ్డీరేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం యథాతథంగానే ఉండొచ్చన్న ఊహాగానాలు సైతం మదుపరులను కొనుగోళ్లకు దూరం చేశాయని మెహెతా ఈక్విటీస్ లిమిటెడ్ సీనియర్ వీపీ (రిసెర్చ్) ప్రశాంత్ తాప్సీ అన్నారు.
బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ షేర్లూ సెల్లింగ్ ప్రెషర్ను ఎదుర్కొన్నాయి. మిడ్క్యాప్ సూచీ 0.53 శాతం, స్మాల్క్యాప్ సూచీ 0.18 శాతం చొప్పున పడిపోయాయి.
మార్కెట్ విలువలో మారుతీ సుజుకీని టాటా మోటర్స్ అధిగమించింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్లో దేశీయ అతిపెద్ద ఆటో రంగ సంస్థగా టాటా మోటర్స్ అవతరించింది. మంగళవారం బీఎస్ఈ ట్రేడింగ్లో టాటా మోటర్స్ షేర్ల విలువ 2 శాతానికిపైగా పెరిగింది. దీంతో సంస్థ మదుపరుల సంపద రూ.3,14,635.06 కోట్లకు చేరింది. మారుతీ సుజుకీ షేర్ నష్టపోవడంతో మార్కెట్ విలువ రూ. 3,13,058.50 కోట్ల వద్దే ఉన్నది.