ముంబై, అక్టోబర్ 30: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడైనప్పటికీ దేశీయ బ్లూచిప్ సంస్థల నుంచి లభించిన మద్దతుతో సూచీలు తిరిగి కోలుకున్నాయి. ప్రారంభంలో నష్టపోయిన సూచీలు చివరి గంటలో మదుపరులు కొనుగోళ్ళకు మద్దతు తెలుపడంతో సెన్సెక్స్ తిరిగి 64 వేల పాయింట్ల పైకి చేరుకున్నది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించింది. ఇంట్రాడేలో 400 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 329.85 పాయింట్లు ఎగబాకి 64,112.65 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ 93.65 పాయింట్లు అందుకొని 19,140.90 వద్ద స్థిరపడింది.