దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం పడుతూ, లేస్తూ కొనసాగినా లాభాలనైతే నిలబెట్టుకున్నాయి. విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) ఆఖర్లో పెట్టుబడులకు ముందుకు రాకున్నా సూచీలు వృద్ధినే కనబర్చాయి. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 509.41 పాయింట్లు లేదా 0.66 శాతం లాభపడి 77,414.92 వద్ద ఆగింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 168.95 పాయింట్లు లేదా 0.72 శాతం పెరిగి 23,519.35 దగ్గర నిలిచింది. అయితే ఈ వారం మదుపరుల పెట్టుబడులు ఫిబ్రవరి ఆటో అమ్మకాలు, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) గణాంకాల ఆధారంగా కొనసాగే వీలున్నట్టు మెజారిటీ నిపుణులు చెప్తున్నారు.
అయినప్పటికీ డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ కదలికలు కీలకమని గుర్తుచేస్తున్నారు. అలాగే గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, ఎఫ్ఐఐ పెట్టుబడులు, ముడి చమురు ధరలు, అంతర్జాతీయ పరిణామాలూ దేశీయ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని చెప్పవచ్చు. కాగా, అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 23,200 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 22,900 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 23,800-24,000 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
గమనిక..
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదుడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.