ముంబై, మే 29: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 344.69 పాయింట్లు లేదా 0.55 శాతం పెరిగి 62,846.38 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 524.31 పాయింట్లు పుంజుకుని 63వేల మార్కును దాటడం గమనార్హం. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 99.3 పాయింట్లు లేదా 0.54 శాతం అందుకుని 18,598.65 వద్ద నిలిచింది. దీంతో సూచీలు మూడో రోజూ లాభాలను సొంతం చేసుకున్నైట్టెంది. అమెరికా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, విదేశీ మదుపరుల పెట్టుబడులు.. దేశీయ స్టాక్ మార్కెట్ల సెంటిమెంట్ను బలపరిచాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత మూడు రోజుల్లో సెన్సెక్స్ 1,072 పాయింట్లు లేదా 1.8 శాతం, నిఫ్టీ 313 పాయింట్లు లేదా 2 శాతం ఎగిశాయి.
మెరిసిన మెటల్, ఫైనాన్స్ షేర్లు
కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్టీ, కమోడిటీస్, ఆటో రంగాల షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. 1.58 శాతం నుంచి 0.63 శాతం వరకు లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ విలువ అత్యధికంగా 3.71 శాతం ఎగబాకింది. జనవరి-మార్చి త్రైమాసికంలో సంస్థ ఆర్థిక ఫలితాలు బాగుండటమే దీనికి కారణం. టైటాన్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లూ పరుగులు పెట్టాయి. ఇక బీఎస్ఈ మిడ్క్యాప్ సూచీ 0.41 శాతం, స్మాల్క్యాప్ సూచీ 0.3 శాతం పెరిగాయి.
గ్లోబల్ మార్కెట్లలో..
అంతర్జాతీయ మార్కెట్ల సంగతికొస్తే.. ప్రధాన ఆసియా మార్కెట్లలో జపాన్, చైనా సూచీలు లాభాల్లో ముగిశాయి. హాంకాంగ్ సూచీ నష్టపోయింది. కీలక ఐరోపా మార్కెట్లలో బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ సూచీలు నష్టాల్లోనే కదలాడుతున్నాయి. అమెరికా మార్కెట్ మాత్రం ఆకర్షణీయ లాభాలను అందుకున్నది. దీంతో భారతీయ మార్కెట్లలోనూ అదే ఉత్సాహం కనిపించింది.