ముంబై, జనవరి 17: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 562.75 పాయింట్లు లేదా 0.94 శాతం ఎగబాకి 60,655.72 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 158.45 పాయింట్లు లేదా 0.89 శాతం ఎగిసి 18,053.3 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉన్నా, డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ క్షీణించినా, విదేశీ మదుపరులు దేశీయ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నా.. మెజారిటీ మదుపరులు మాత్రం కొనుగోళ్లకే ఆసక్తి కనబర్చారని నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హెచ్డీఎఫ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ వంటి బడా షేర్లు ఆకట్టుకున్నాయి. దీంతో ఉదయం ఆరంభం నుంచి ట్రేడింగ్ ముగిసే వరకు సూచీలు లాభాల్లోనే నడిచాయి. కాగా, ఎల్అండ్టీ షేర్ విలువ అత్యధికంగా 3.51 శాతం పుంజుకున్నది. హెచ్యూఎల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లూ లాభపడ్డాయి. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న ముడి చమురుపై, అలాగే డీజిల్, విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతులపై గతంలో విధించిన విండ్ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ను తగ్గించడం మార్కెట్ సెంటిమెంట్ను బలపర్చిందని ట్రేడర్లు అభిప్రాయపడుతున్నారు. బీఎస్ఈ స్మాల్క్యాప్ సూచీ 0.13 శాతం, మిడ్క్యాప్ సూచీ 0.06 శాతం చొప్పున నష్టపోయాయి. మదుపరులు ఎక్కువగా లార్జ్క్యాప్ (సెన్సెక్స్) షేర్లకే పెద్దపీట వేశారని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.