Stock Markets | ముంబై, మే 23: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. కేంద్ర ప్రభుత్వానికి బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన రూ.2.11 లక్షల కోట్ల మెగా డివిడెండ్.. మదుపరుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ క్రమంలోనే ఉదయం ఆరంభం నుంచే జోరు మీదున్న సూచీలు.. సమయం గడుస్తున్నకొద్దీ పరుగందుకున్నాయి. చివరకు మునుపెన్నడూ లేనివిధంగా ఆల్టైమ్ హై వద్ద స్థిరపడ్డాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,196.98 పాయింట్లు లేదా 1.61 శాతం ఎగిసి 75వేల మార్కుకు ఎగువన 75,418.04 వద్ద నిలిచింది.
ఈ ఏడాది జనవరి 29 తర్వాత ఒక్కరోజే సెన్సెక్స్ ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ఇక ఒకానొక దశలో 1,278.85 పాయింట్లు పెరిగింది. దీంతో 75,499.91 స్థాయిని చేరి ఇంట్రా-డే ఆల్టైమ్ హై రికార్డును నెలకొల్పింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 23వేల స్థాయికి చేరువైంది. 369.85 పాయింట్లు లేదా 1.64 శాతం పుంజుకొని 22,967.65 వద్ద స్థిరపడింది. ఇంట్రా-డేలో 395.8 పాయింట్లు పెరిగి మొదటిసారి 22,993.60 స్థాయిని తాకింది.
ఆటో రంగ షేర్లు అత్యధికంగా 2.28 శాతం పెరిగాయి. ఆ తర్వాత క్యాపిటల్ గూడ్స్ 2.13 శాతం, బ్యాంకింగ్ 1.98 శాతం, ఆర్థిక సేవలు 1.64 శాతం, సేవలు 1.63 శాతం, టెక్నాలజీ 1.42 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషనరీ 1.19 శాతం, ఐటీ 1.18 శాతం చొప్పున లాభపడ్డాయి. షేర్లవారీగా.. మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, మారుతి, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ 0.58 శాతం, స్మాల్క్యాప్ 0.27 శాతం పెరిగాయి.
భారీ లాభాల మధ్య బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో నమోదైన సంస్థల మార్కెట్ విలువ 10 లక్షల కోట్ల డాలర్లను మించిపోయింది. బుధవారం బీఎస్ఈ మార్కెట్ విలువ 5 లక్షల కోట్ల డాలర్ల మార్కును తొలిసారి తాకగా, గురువారం ఎన్ఎస్ఈ మార్కెట్ విలువ మొదటిసారి ఈ రికార్డును సాధించింది. ఇక ఈ ఒక్కరోజే బీఎస్ఈ నమోదిత మదుపరుల సంపద రూ.4.28 లక్షల కోట్లు పెరిగింది. రూ.4,28,602.18 కోట్లు పుంజుకొని రూ.420.22 లక్షల కోట్లు (5.05 ట్రిలియన్ డాలర్లు)గా నమోదైంది. అలాగే ఎన్ఎస్ఈలో నమోదైన సంస్థల మార్కెట్ విలువ రూ.416.57 లక్షల కోట్లు (5 ట్రిలియన్ డాలర్లు)గా ఉన్నది. దీంతో ఈ రికార్డును సాధించిన 5వ దేశంగా భారత్ నిలిచింది.