దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల జోష్లో సాగుతున్నాయి. మదుపరులు పెట్టుబడులకు మద్దతు పలుకుతున్నారు. గత వారం ట్రేడింగ్లో గురువారం ఒక్కరోజే సెన్సెక్స్ 1,440, నిఫ్టీ 470 పాయింట్లు పెరిగాయి. ఈ క్రమంలోనే వారం మొత్తంగా సూచీలు భారీ ఎత్తున పుంజుకోగలిగాయి. అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,707.01 పాయింట్లు ఎగిసి 82,890.94 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 504.35 పాయింట్లు ఎగబాకి 25,356.50 దగ్గర ముగిసింది. మునుపెన్నడూ లేనివిధంగా సెన్సెక్స్ తొలిసారి 83వేల మార్కును అధిగమించింది. నిఫ్టీ సైతం నూతన గరిష్ఠాలను తాకింది. ఈ నేపథ్యంలో ఈ వారం అమ్మకాల ఒత్తిడికి ఆస్కారం కనిపిస్తున్నది. శుక్రవారమే మార్కెట్లలో సెల్లింగ్ ప్రెషర్ ఉండటాన్ని గమనించవచ్చు. పారిశ్రామికోత్పత్తి మందగించడం, ద్రవ్యోల్బణం మళ్లీ విజృంభిస్తున్న సంకేతాలు రావడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు బ్రేక్ వేయవచ్చన్న అభిప్రాయాలను మెజారిటీ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. పైగా సూచీలు ఆల్టైమ్ హైల్లో ఉండటం కూడా లాభాల స్వీకరణకు తావిస్తోందంటున్నారు. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య సమీక్ష ప్రభావం కూడా కనిపించ నున్నది. ఇక గ్లోబల్ స్టాక్ మార్కెట్లు, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు, అంతర్జాతీయ పరిణామాలు, డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ ఈ వారం కూడా భారతీయ స్టాక్ మార్కెట్ల తీరును నిర్దేశించనున్నాయి. అమ్మకాల ఒత్తిడి ఎదురైతే నిఫ్టీకి 24,900 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 24,700 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం 25,700-25,900 మధ్యకు నిఫ్టీ వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఏ బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.