ముంబై, జనవరి 11: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) విశ్లేషకుల అంచనాలకు దగ్గరగా ఆర్థిక ఫలితాల్ని వెల్లడించింది. 2023 డిసెంబర్తో ముగిసిన మూడవ త్రైమాసికంలో టీసీఎస్ నికరలాభం అంతక్రితం ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 2 శాతం వృద్ధితో రూ.11,058 కోట్లకు పెరిగింది. ఆదాయం 4 శాతం పెరిగి రూ. 60,583 కోట్లకు చేరింది. క్యూ2తో పోలిస్తే క్యూ 3లో ఆదాయం 1.5 శాతం పెరగ్గా, లాభం 2.5 శాతం తగ్గింది. లీగల్ క్లెయిం సెటిల్మెంట్ కోసం రూ.958 కోట్లు కేటాయించడం క్యూ 3లో లాభం పరిమితంగా నమోదయ్యింది. మెజారిటీ బ్రోకరజ్ సంస్థలు రూ.60,119 కోట్ల ఆదాయాన్ని, రూ.11, 446 కోట్ల నికరలాభాన్ని అంచనా వేశాయి. గురువారం సమావేశమైన టీసీఎస్ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.18 ప్రత్యేక డివిడెండ్ రూ.9 మధ్యంతర డివిడెండ్ కలిపి మొత్తం రూ.27 డివిడెండ్ను సిఫార్సు చేసింది.
మూడవ త్రైమాసికంలో టీసీఎస్ 8.1 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ను చేజిక్కించుకుంది. అయితే సెప్టెంబర్లో సంపాదించిన 11.2 బిలియన్ డాలర్ల కాంట్రాక్టులకంటే క్యూ3లో తక్కువగానే సాధించింది. కంపెనీ ఇబిట్ మార్జిన్ 24.3 శాతం నుంచి 25. శాతానికి పెరిగింది. ప్రాంతాలవారీగా చూస్తే టీసీఎస్ యూకే ఆదాయం 8.1 శాతం వృద్ధిచెందగా, ఉత్తర అమెరికాలో 3 శాతం తగ్గింది. కానీ భారత్తో సహా ఇతర వర్థమాన మార్కెట్లలో కంపెనీ ఆదాయాన్ని భారీగా 23.4 శాతం పెంచుకుంది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలో 16 శాతం, లాటిన్ అమెరికాలో 13.4 శాతం ఆసియా ఫసిపిక్లో 3.9 శాతం చొప్పున పెరిగింది. వివిధ రంగాల ప్రకారం చూస్తే అత్యధిక భాగం ఆదాయాన్ని ఆర్జించిపెట్టే బీఎఫ్ఎస్ఐ విభాగంలో 3 శాతం తగ్గింది. మీడియా, కమ్యూనికేషన్స్ విభాగంలో ఆదాయం 4.9 శాతం, టెక్నాలజీ సర్వీసుల్లో ఆదాయం 5 శాతం చొప్పున తగ్గింది. ఎనర్జీ, యుటిలిటీస్ విభాగాల ఆదాయం 11.8 శాతం, తయారీ రంగం ఆదాయం 7 శాతం లైఫ్ సైన్సెస్, హెల్త్కేర్ ఆదాయం 3.1 శాతం చొప్పున పెరిగింది.
డిసెంబర్ 31నాటికి టీసీఎస్లో 6,03, 305 మంది ఉద్యోగులున్నారు. వలసల రేటు క్యూ2లో 14.9 శాతం ఉండగా, క్యూ3లో 13.3 శాతానికి తగ్గింది. వచ్చే ఏడాది కోసం తాము కాలేజ్ క్యాంపస్ నియామకాల ప్రక్రియ ప్రారంభించామని టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్ మిలింద్ లక్కడ్ తెలిపారు.