Exports | న్యూఢిల్లీ, అక్టోబర్ 2: దేశంలో కోట్లాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని అందిస్తున్న కీలక రంగాల్లో ఎగుమతులు నత్తనడకన సాగుతున్నాయి. దుస్తులు, సముద్ర ఉత్పత్తులు, ప్లాస్టిక్స్, రత్నాలు-ఆభరణాల వంటి కార్మిక శక్తి అధికంగా ఉన్న రంగాలు నైరాశ్యంలోకి జారుకున్నాయి. ఈ రంగాల్లో అంతర్జాతీయ ఎగుమతుల్లో భారత్ వాటా గత ఐదేండ్లుగా అంతకంతకూ పడిపోతున్నది మరి. దీంతో భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఆయా రంగాల తీరు అధ్వాన్నంగా ఉంటున్నదని, ఎగుమతుల్లో మందగమనం స్పష్టంగా కనిపిస్తున్నదని ఎఫ్ఐఈవో చెప్తున్నది. ఈ నేపథ్యంలో రాబోయే సంవత్సరాల్లోనూ మెరుగుపడటం కష్టమేననిపిస్తున్నట్టు వ్యాఖ్యానించడం గమనార్హం.
ఆదరణ కరువైంది..
దుస్తుల తయారీ, సముద్ర ఉత్పత్తులు, ప్లాస్టిక్స్, రత్నాలు-ఆభరణాల ఇండస్ట్రీపై ఆధారపడి దేశంలో ఎంతోమంది జీవిస్తున్నారని ఎఫ్ఐఈవో గుర్తుచేస్తున్నది. ఈ రంగాల్లో ఉద్యోగ-ఉపాధి సృష్టి గణనీయంగా ఉందని, నెట్ హై-వాల్యూ ఆడిషన్లో ఈ కంపెనీల వాటా కూడా ఎక్కువేనని, అయినప్పటికీ 1 నుంచి 2 శాతం వృద్ధికే పరిమితమవుతున్నాయని ఎఫ్ఐఈవో ఓ తాజా నివేదికలో తెలిపింది. నిజానికి వివిధ దేశాల్లో ఇదే రంగాల వృద్ధిరేటు ఆకర్షణీయంగా ఉందని గుర్తుచేస్తుండటం గమనించదగ్గ అంశంగా నిలుస్తున్నదిప్పుడు. అల్లిక దుస్తుల్లో అంతర్జాతీయ వాణిజ్యం 6 శాతంగా ఉంటే, భారత్ వృద్ధి కేవలం 2 శాతమేనన్నది.
ప్రభుత్వ ప్రోత్సాహం కావాలి
కేంద్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలతోనే ఆయా రంగాల్లో నూతనోత్సాహం వస్తుందని ఎఫ్ఐఈవో అంటున్నది. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పోటీ వాతావరణంతో దేశీయ సంస్థలు లబ్ధి పొందాల్సిన అవసరం ఉన్నదని సూచిస్తున్నది. ఈ క్రమంలోనే ఉత్పాదక వ్యయం తగ్గేలా, నాణ్యత-కొత్తదనం పెరిగేలా చర్యలు తీసుకోవాలని, ఈ దిశగా సర్కారీ విధానాల్లో మార్పులు చేయాలన్న అభిప్రాయాలు పరిశ్రమ వర్గాల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి.
ఆర్థిక మంత్రికి లేఖ
వచ్చే ఏడాది మార్చి 31దాకా ఎమర్జన్సీ క్రెడిట్ లింక్డ్ గ్యారంటీ స్కీంను పొడిగించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ఎఫ్ఐఈవో లేఖ రాసింది. ఎంఎస్ఎంఈ తయారీదారులకు 5 శాతం వడ్డీ రాయితీ ప్రయోజనాన్నీ పునరుద్ధరించాలన్నది.
‘చిన్నతరహా సంస్థలకు సులభంగా, చౌకగా రుణాలు అందాలి. ఎగుమతుల రవాణాకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నుంచి మినహాయింపునివ్వాలి. తద్వారా మార్కెటింగ్కు ప్రభుత్వాలు దన్నుగా నిలవాలి. అప్పుడే దేశంలో ఉత్పాదకత, ఉపాధి కల్పన వేగంగా పెరిగేందుకు వీలుంటుంది.’
-ఏ శక్తివేల్, ఎఫ్ఐఈవో అధ్యక్షుడు