Gold | న్యూఢిల్లీ, ఆగస్టు 1: దేశంలో బంగారానికి డిమాండ్ తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో గతంతో పోల్చితే 7 శాతం పడిపోయింది. నిరుడు ఇదే త్రైమాసికంలో అమ్మకాలు 170.7 టన్నులుగా ఉంటే.. ఈసారి 158.1 టన్నులుగానే ఉన్నట్టు మంగళవారం ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) వెల్లడించింది. విలువపరంగా చూసినైట్టెతే పోయినసారి రూ.82,530 కోట్లుగా, ఈసారి రూ.79,270 కోట్లుగా ఉన్నట్టు తమ తాజా నివేదికలో డబ్ల్యూజీసీ తెలియజేసింది. బంగారం వినియోగంలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.
అధిక ధరలతో దెబ్బ
భారతీయ మార్కెట్లో బంగారానికి అధిక ధరలున్నాయని, అందుకే డిమాండ్ తగ్గిందని డబ్ల్యూజీసీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. స్వల్పకాలంలోనే 10 గ్రాముల ధర గరిష్ఠంగా రూ.64,000లకు చేరిందన్నది. అలాగే దేశంలో పడుతున్న పన్నుల భారం కూడా సేల్స్ను ప్రభావితం చేశాయని చెప్పింది. అయితే రూ.2,000 నోట్లపై నిషేధం.. బంగారం అమ్మకాలను కొంతమేర పెంచగలిగిందని డబ్ల్యూజీసీ ఇండియా పేర్కొన్నది. కాగా, ఈసారి వర్షాలు దేశవ్యాప్తంగా సమృద్ధిగా కురిస్తే.. పంట దిగుబడులు పెరిగి మార్కెట్లో పసిడికి మళ్లీ డిమాండ్ పుంజుకోవచ్చన్న అంచనాల్ని డబ్ల్యూజీసీ వెలిబుచ్చింది. రాబోయే దీపావళికి పసిడి అమ్మకాలు ఆశాజనకంగా ఉండొచ్చన్నది.
ప్రపంచవ్యాప్తంగా..
గ్లోబల్ గోల్డ్ డిమాండ్ 2 శాతం దిగజారి ఈ ఏప్రిల్-జూన్లో 921 టన్నులుగా ఉన్నది. ఓవర్-ది-కౌంటర్ (ఓటీసీ) లావాదేవీలను కలిపితే మాత్రం గతంలో కంటే 7 శాతం పెరిగి 1,255 టన్నులకు చేరింది. అయితే అధిక ధరలున్నప్పటికీ నగలకు ఆదరణ కనిపించినట్టు డబ్ల్యూజీసీ తెలియజేసింది. ఇక కేంద్ర బ్యాంకుల నుంచి డిమాండ్ క్షీణించిందని, ఈసారి 103 టన్నులకే పరిమితమైనట్టు వెల్లడించింది. పెట్టుబడుల విషయానికొస్తే.. కడ్డీలు, నాణేలకు డిమాండ్ 6 శాతం పెరిగి 277 టన్నులుగా నమోదైంది. దీంతో జనవరి-జూన్ మధ్య 582 టన్నులకు చేరింది. ఇదిలావుంటే గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) నుంచి ఈ ఏప్రిల్-జూన్లో 21 టన్నుల మేర పెట్టుబడులు తరలిపోయాయి.
డబ్ల్యూజీసీ నివేదిక ముఖ్యాంశాలు
‘దేశీయ మార్కెట్లో పెరుగుతున్న రేట్లతో చాలామంది బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. అవసరమైతే తప్ప కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ పరిస్థితులు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. అందుకే ఏప్రిల్-జూన్లో డిమాండ్ 7 శాతం క్షీణించింది’
-సోమసుందరం పీఆర్, డబ్ల్యూజీసీ ఇండియా ప్రాంతీయ సీఈవో