న్యూఢిల్లీ, ఆగస్టు 4: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అంచనాలకుమించి రాణించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతోపాటు వడ్డీల మీద వచ్చే ఆదాయం పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.16,884 కోట్ల స్టాండ్లోన్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.6,068 కోట్ల కంటే ఇది రెండింతలు అధికం. కానీ, మార్చి త్రైమాసికంలో నమోదైన రూ.16,695 కోట్ల కంటే కేవలం 1.14 శాతం పెరుగుదల నమోదైంది. గత త్రైమాసికంలో బ్యాంక్ రూ. 1,08,039 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాది ఇది రూ.74,989 కోట్లుగా ఉన్నది.
‘గత త్రైమాసికంలో రికార్డు స్థాయి లాభాలను ఆర్జించగలిగాం. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం, వడ్డీల మీద వచ్చే ఆదాయం పుంజుకోవడం ఇందుకు కారణం. ట్యాక్స్ రిఫండ్కు సంబంధించి రూ.830 కోట్ల నిధులు సమకూరడం కూడా లాభాలు పెరగడానికి దోహదం చేశాయి.
– దినేశ్ ఖారా, ఎస్బీఐ చైర్మన్