SBI | న్యూఢిల్లీ, జూలై 14: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 5 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెంపుతో రుణ గ్రహీతలు చెల్లించే ఈఎంఐలు మరింత భారం కానున్నాయి. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఎంసీఎల్ఆర్తో అనుసంధానమైన అన్ని రకాల రుణాలపై వడ్డీరేటు పెరగనున్నది.
ఈ పెంపు శనివారం నుంచి అమలులోకి రానున్నట్లు బ్యాంక్ పేర్కొంది. దీంతో ఏడాది కాలపరిమితి కలిగిన ఎంసీఎల్ఆర్ 8.50 శాతం నుంచి 8.55 శాతానికి చేరుకోగా..ఒక్కరోజు, నెల రుణాలపై ఐదు బేసిస్ పాయింట్లు పెరగడంతో రుణ రేటు 8 శాతం, 8.15 శాతానికి చేరుకున్నది. ఆరు నెలల కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ 8.45 శాతానికి చేరుకోగా..రెండేండ్ల ఎంసీఎల్ఆర్ 8.65 శాతంగా నమోదైంది.