న్యూఢిల్లీ, నవంబర్ 11: వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్ల జోరు కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ స్థూల ప్రత్యక్ష పన్నులు రూ.10.54 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 10 వరకూ నిరుడు ఇదేకాలంతో పోలిస్తే ఈ వసూళ్లు 31 శాతం వృద్ధిచెందినట్టు శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.
రిఫండ్స్ను మినహాయిస్తే వ్యక్తిగత, కార్పొరేట్ ట్యాక్స్లు కలిపి నికరంగా రూ.8.71 లక్షల కోట్లు వసూలయ్యాయన్నది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో నిర్దేశించిన వసూళ్ల లక్ష్యంలో నవంబర్ 10 వరకూ 61.31 శాతం వసూళ్లు జరిగాయని తెలిపింది. కార్పొరేట్ పన్నులు 22.03 శాతం పెరగ్గా, వ్యక్తిగత పన్నులు 40.64 శాతం పెరిగాయి.