న్యూఢిల్లీ, నవంబర్ 10: ధంతేరస్ (ధనత్రయోదశి) అమ్మకాలు శుక్రవారం జోరుగా సాగాయి. బంగారం, వెండి కొనుగోళ్ల కస్టమర్లతో హైదరాబాద్సహా దేశంలోని అన్ని ప్రధాన నగరాల మార్కెట్లలో సందడి నెలకొన్నది. మధ్యాహ్నం 12:35 నుంచి శనివారం మధ్యాహ్నం 01:57 వరకు ధంతేరస్ ముహూర్తం ఉండటంతో వ్యాపారంపై జ్యుయెల్లర్స్ ఈసారి భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ధనత్రయోదశి రెండు రోజులు వచ్చినట్టేనని వారు చెప్తున్నారు. కాగా, రెండు వారాల కింద తులం 24 క్యారెట్ పసిడి రూ.63,000 పలుకగా, ఇప్పుడది సుమారు రూ.2,000 తక్కువకే లభిస్తుండటం సేల్స్కు కలిసొచ్చిందని నగల వర్తకులు చెప్తున్నారు. ధంతేరస్ రోజున బంగారం, వెండి తదితర విలువైన లోహాలు, వాటితో తయారైన నగలు, వస్తూత్పత్తుల కొనుగోళ్లు శుభప్రదమని భారతీయుల నమ్మకమన్న విషయం తెలిసిందే. ఇక గత ఏడాది ధంతేరస్ రోజున ఢిల్లీలో తులం 24 క్యారెట్ బంగారం రేటు రూ.50,139 (పన్నులు అదనం) పలికింది. అంతకుముందు సంవత్సరం 2021లో రూ.47,644గా ఉన్నది.
తేలికపాటి బరువు కలిగిన నగలకు యువత నుంచి డిమాండ్ ఎక్కువగా కనిపిస్తున్నట్టు వ్యాపారులు చెప్తున్నారు. మరోవైపు వజ్రాల ధరలు కూడా దిగిరావడం సేల్స్కు ఉత్సాహాన్నిస్తున్నట్టు పేర్కొంటున్నారు. బంగారు, వెండి నాణేలకూ ఆదరణ ఉన్నట్టు వివరిస్తున్నారు. ‘మార్కెట్లో ప్రస్తుతం బంగారం ధరలు వ్యాపారానికి అనుకూలంగా ఉన్నాయి. కస్టమర్ల రాక పెరిగింది. శనివారం మధ్యాహ్నం వరకు ముహూర్తం ఉండటంతో ఈసారి సేల్స్ బాగానే జరిగేందుకు వీలున్నది’ అని అఖిల భారత రత్నాలు, ఆభరణాల మండలి డైరెక్టర్ దినేశ్ జైన్ తెలిపారు. ఈ క్రమంలోనే గత ఏడాదితో పోల్చితే అమ్మకాలు 20 శాతం వరకు ఎక్కువగానే ఉంటాయన్న విశ్వాసం వ్యాపారుల నుంచీ వ్యక్తమవుతున్నది.
ధనత్రయోదశి రోజున బంగారం ధరలకు రెక్కలు తొడిగాయి. శుక్రవారం హైదరాబాద్లో తులం 24 క్యారెట్ పసిడి ధర రూ.330 పెరిగి రూ.61,090గా నమోదైంది. 22 క్యారెట్ రేటు 10 గ్రాములు రూ.300 ఎగిసి రూ.56,000లు పలికింది. ఢిల్లీలోనూ రూ.250 పుంజుకొని 24 క్యారెట్ గోల్డ్ రూ.61,200 తాకింది. నిజానికి గత ఆరు రోజుల్లో బంగారం ధరలు సుమారు వెయ్యి రూపాయలదాకా తగ్గుముఖం పట్టాయి. కాగా, గ్లోబల్ మార్కెట్లో ఔన్సు బంగారం 1,956 డాలర్లు, వెండి 22.65 డాలర్లుగా ఉన్నాయి. ఇక దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర ఢిల్లీలో రూ.700 ఎగబాకి రూ.74,000లుగా, హైదరాబాద్లో రూ. 800 ఎగిసి రూ.77,000లుగా ఉన్నది.
ధంతేరస్ సందర్భంగా వాహన విక్రయాలూ భారీగానే జరిగాయి. రెండంకెల వృద్ధి నమోదైందని ఆటో కంపెనీలు తెలిపాయి. గతంతో పోల్చితే ఇండస్ట్రీ మొత్తంగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు కనీసం 21 శాతం పెరగవచ్చని మారుతీ సుజుకీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఎల్జీ, పానసోనిక్, గోద్రేజ్ తదితర గృహోపకరణాల సంస్థల సేల్స్ సైతం పెద్ద ఎత్తునే నమోదయ్యాయి. 15-20 శాతం వృద్ధిని కనబర్చాయి.