హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): సురక్షితమైన ప్రజారవాణా దిశగా తెలంగాణ అడుగులు వేస్తున్నదని, భద్రతతో కూడిన ప్రజా రవాణాలో హైదరాబాద్ బెస్ట్ సిటీగా అవతరిస్తున్నదని డీజీపీ అంజనీకుమార్ వెల్లడించారు. హైదరాబాద్ బిట్స్ పిలానీ డైరెక్టర్ ప్రొఫెసర్ సుందర్ నేతృత్వంలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రాజెక్టు కింద క్యాంపస్లో సోమవారం వర్క్షాప్ నిర్వహించారు. ‘టెక్నాలజీస్ ఫర్ అర్బన్ ట్రాన్సిట్ టు ఎన్హన్స్ మొబిలిటీ అండ్ యాక్సెస్బులిటీ’ (టీయూటీఈఎం)పై నిర్వహించిన ఈ కార్యక్రమానికి డీజీపీసహా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హాజరయ్యారు. నేడు దేశవ్యాప్తంగా భద్రతతో కూడిన ప్రజా రవాణా సవాల్గా మారిందని డీజీపీ అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో సాంకేతికతతో కూడిన ప్రజారవాణాను ప్రజలు భద్రతగా గుర్తిస్తున్నారని, సమర్థవంతమైన నాయకత్వం వల్లే ఇది సాధ్యమవుతుందని వివరించారు. ఐఐటీలు, బిట్స్ వంటి ఇంజినీరింగ్ కాలేజీలు సురక్షితమైన ప్రజారవాణాకు సాంకేతికతను జోడించడంపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సేఫ్టీ ట్రావెలింగ్కు ఇస్తున్న ప్రాధాన్యం వల్లే ఇతర దేశాలకు చెందిన కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయని చెప్పారు. ప్రొఫెసర్లు పీ యోగేశ్వరి, అవిజిత్ మాజి, ప్రశాంత్ సాహు, అరోపాల్ గోస్వామి, జపాన్కు చెందిన నవోకి కిరిటాని రూపొందించిన ‘పార్టిసిపేటరీ ప్లానింగ్ ప్రాసెస్’ సాంకేతికత వ్యవస్థను డీజీపీ ఆవిష్కరించారు.