DGCA Notice | ఎయిర్ ఇండియా, స్పైస్జెట్లకు గురువారం డీజీసీఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పొగ మంచు వల్ల తక్కువ దృశ్య గోచరత ఉన్నప్పుడు సుశిక్షితులైన పైలట్లను నియమించనందుకు ఈ నోటీసులు జారీ చేసింది. గత నెల చివరిలో పొగ మంచు వల్ల తక్కువ దృశ్య గోచరత పరిస్థితులతో ఢిల్లీ విమానాశ్రయ పరిధిలో పలు విమానాలను పైలట్లు దారి మళ్లించారు. దట్టమైన పొగ మంచు వల్ల గత నెల 25-28 మధ్య వివిధ విమానయాన సంస్థలు దాదాపు 60 విమానాలను దారి మళ్లించడంతో ఢిల్లీ విమానాశ్రయ పరిధిలో విమాన సర్వీసుల నిర్వహణపై ప్రభావం చూపింది. గత నెల 25 నుంచి 28 వరకు అననుకూల వాతావరణం వల్ల 58 విమానాలను ఆరు గంటల పాటు దారి మళ్లించారని ఢిల్లీ విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
తక్కువ దృశ్య గోచరత పరిస్థితుల్లో విమానాలను నడిపే సామర్థ్యం గల సుశిక్షిత పైలట్లను సంబంధిత విమానయాన సంస్థలు నియమించలేదని ఢిల్లీ విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు గురువారం డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. తమకు డీజీసీఏ జారీ చేసిన షోకాజ్ నోటీసులపై ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ యాజమాన్యాలు స్పందించలేదు. ఇదే అంశంపై ఇతర ఎయిర్లైన్స్ సంస్థలకు డీజీసీఏ నోటీసులు జారీ చేసిందా.. లేదా.. అన్న సంగతి తెలియరాలేదు.
ప్రతియేటా 15-20 రోజులు ఢిల్లీ విమానాశ్రయ పరిధిలో విమాన సర్వీసుల నిర్వహణకు పొగ మంచు ఇబ్బందికరమేనని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గత నెల 29న చెప్పారు. ఈ ఏడాది దట్టమైన పొగ మంచుతో అసాధారణ పరిస్థితి నెలకొందన్నారు. తాము రోజువారీగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. తక్కువ దృశ్య గోచరత పరిస్థితుల నేపథ్యంలో విమానాలను నడిపేందుకు విమాన యాన సంస్థలు క్యాట్2, క్యాట్3 ట్రైన్డ్ పైలట్లను నియమించాల్సి ఉంటుందన్నారు.