ఫ్రాంక్ఫర్ట్ : జర్మనీలో అతిపెద్ద లెండర్ డ్యుయిష్ బ్యాంక్ (Deutsche Bank) 3500 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించనున్నట్టు గురువారం ప్రకటించింది. 2023లో బ్యాంక్ లాభాలు పడిపోవడంతో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా బ్యాంక్ కొలువుల కోతకు తెగబడింది. లాభాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 16 శాతం తగ్గడం, పునర్వ్యవస్ధీకరణ, పరిహార వ్యయాలు పెరగడం బ్యాంక్ లాభదాయకతపై ప్రభావం చూపింది.
అయితే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధిక వడ్డీరేట్ల కారణంగా బ్యాంక్ రాబడులు మాత్రం ఆరు శాతం వృద్ధి కనబరిచాయి. అనిశ్చితి వాతావరణంలోనూ బ్యాంక్ మెరుగైన సామర్ధ్యం కనబరిచిందని డ్యుయిష్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్రిస్టియన్ సివింగ్ పేర్కొన్నారు. వ్యయ నియంత్రణ చర్యలకు కట్టుబడి క్రమశిక్షణతో ముందుకెళతామని చెప్పారు.
లాభాలను మెరుగుపరిచే క్రమంలో రాబోయే రెండేండ్లలో 3500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు డ్యుయిష్ బ్యాంక్ తెలిపింది. నాన్ క్లయింట్ విభాగాల్లో లేఆఫ్స్ ఉంటాయని తెలిపింది. 2022 నాటికి డ్యుయిష్ బ్యాంక్లో ప్రపంచవ్యాప్తంగా 85,000 మంది ఉద్యోగులున్నారు.
Read More :